అర్ధరాత్రి మీ ఎమ్మెల్సీని ఎందుకు పార్టీ బహిష్కరించావ్: రాజాసింగ్ సూటి ప్రశ్న
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్సీపై వేటు పడింది. తక్షణమే తన సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ పార్టీ అధిష్ఠానం ఆయనను ఆదేశించింది. పార్టీ నుంచి కూడా ఆయనను బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించింది. ఆయనతో ఎటువంటి సంబంధాలు ఉండవనీ తేల్చి చెప్పింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి కూడా.
అఖిల భారత మజ్లిస్- ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించింది. దీనితో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న శాసన మండలి సభ్యత్వానికి కూడా తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్ ఎ హుస్సేన్ అన్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. రహమత్ బేగ్.. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఈ పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ స్పందించారు. అర్ధరాత్రి వేళ ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీనికి గల కారణాలను తెలియజేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పాతబస్తీలోని ప్రతి ముస్లింలో కూడా ఇదే అనుమానం ఉందని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీదేనని తేల్చి చెప్పారు. భూఆక్రమణ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఒవైసీ ఆయనపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
దీనిపై తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఓ మైనర్ బాలికపై రహ్మత్ బేగ్ అత్యాచారానికి పాల్పడ్డాడని, సెక్స్ స్కాండల్ లో ఆయనకు ప్రమేయం ఉందా అనే సందేహాలు ఉన్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక స్థానిక యువకులు కొందరు రహ్మత్ బేగ్ ను దేహశుద్ధి చేశారంటూ మజ్లిస్ నాయకులు, కార్యకర్తలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇందులో తన పరువు పోకూడదనే కారణంతోనే రహ్మత్ బేగ్ పై ఒవైసీ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఓల్డ్ సిటీ దారుస్సలాం పార్టీ ఆఫీస్ లో కూర్చుని జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే ఒవైసీ.. ఇప్పుడు రహ్మత్ బేగ్ వ్యవహారంలో ఇలాగే చెప్పే దమ్ముందా అంటూ రాజా సింగ్ సవాల్ విసిరారు.













Click it and Unblock the Notifications