ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీపార్టీలో ముసలం...ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యల దుమారం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల మధ్య ముసలం పుట్టిందా ? అధికార పార్టీ నేతలు బాహాటంగానే ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకొంటున్నారా? టిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయా? సోషల్ మీడియా వేదికగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కామెంట్స్ తో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
పినపాక నియోజకవర్గంలో ఆధిపత్య పోరు
వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న, గతంలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య చర్చకు కారణమవుతున్నాయి. గతంలో అధికారులను ఉద్యోగం చేస్తారా ఇంటికి వెళ్తారా అంటూ మండిపడి సెన్సేషన్ సృష్టించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు తాజాగా అధికార పార్టీ నేతల పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగే నాయకులు మాత్రమే తనతో కలిసి పనిచేయాలని మనకు మాజీ ఎమ్మెల్యే తోనే పోటీ ఉంటుందంటూ, అందులో ఎటువంటి సందేహమూ లేదంటూ పాయం వెంకటేశ్వర్లు ను టార్గెట్ చేశారు.
సొంతపార్టీలోనే శత్రువులు .. మాజీ ఎమ్మెల్యేతోనే పోటీ అన్న రేగా కాంతారావు
సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన తన అనుచరులకు సందేశాలను పంపారు. పినపాక నియోజకవర్గంలో మనకు మాజీ ఎమ్మెల్యే తోనే పోటీ ఉంటుందని, హ్యాట్రిక్ సాధించడానికి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
అంతేకాదు పినపాక అభివృద్ధి నేను చూసుకుంటానని, బాధ్యతలు తీసుకున్న మండల నాయకులు గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించండి అంటూ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు గ్రామాలలో సమస్యలను నిర్లక్ష్యం చేయకండి రాజకీయాలు సంగతి తాను చూసుకుంటాను అంటూ వెల్లడించారు.
టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే వారే తన పర్యటనలలో పాల్గొనాలి
ఇదే క్రమంలో తాను గ్రామాలలో పర్యటించినప్పుడు పక్కాగా టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగే నాయకులు మాత్రమే పాల్గొనండి, రెండో ఆలోచన చేసే వారికి ఇకనుండి ఫోన్లు రావు అంటూ రేగా కాంతారావు తమకు సహకరించని ప్రత్యర్థి వర్గాన్ని టార్గెట్ చేశారు. శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా, పినపాక ప్రజలు న్యాయాన్ని మాత్రమే గెలిపిస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడించారు. తమ నాయకుడిపై నమ్మకం లేని వాళ్లు చెప్పే మాటలు నమ్మవద్దని పేర్కొన్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యక్తిగత స్వార్థం కోసం ఏదైనా చెబుతారు అంటూ విమర్శించారు.
మోసగాళ్ళ మాటలు హరికథల్లా ఉంటాయి.. నమ్మొద్దు
వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని మోసగాళ్ల మాటలు హరికథల్లా ఉంటాయని, ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదని రేగా కాంతారావు హెచ్చరించారు. పోటీదారుని పార్టీ ఏదైనా కావచ్చు కానీ గెలిచేది టీఆర్ఎస్ మనమే అంటూ వరుస పోస్టులతో రేగా కాంతారావు రెచ్చిపోయారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రభుత్వ విప్ అయ్యారు. ఇక రేగా కాంతారావు చేతిలో ఓటమి పాలైన టిఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేగా కాంతారావు నియోజక వర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడంతో రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది.
పినపాక నియోజకవర్గంపై పట్టు కోసం నేతల మధ్య కోల్డ్ వార్
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు అవకాశం ఇస్తారని పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగానే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ పాయం వెంకటేశ్వర్లుకు అవకాశం కల్పించలేదు. దీంతో తీవ్ర అసహనంలో ఉన్నారు పాయం వెంకటేశ్వర్లు. ఇటు నియోజకవర్గంలో పట్టు కోసం పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు ఆధిపత్యానికి బ్రేక్ వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేగా కాంతారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలను బట్టబయలు చేశాయి. పార్టీ శ్రేణుల మధ్య పినపాక నియోజకవర్గం పై ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.