అందులో కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెస్ట్, సీరియస్గా తీసుకున్న కేసీఆర్
నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం (సిడిపి) కింద ఇచ్చే నిధులను చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఖర్చు చేయకుండా, ఎన్నికలకు ముందు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్: నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం (సిడిపి) కింద ఇచ్చే నిధులను చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఖర్చు చేయకుండా, ఎన్నికలకు ముందు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు.
ప్రభుత్వ నివేదిక ప్రకారం గత మూడేళ్లలో 119 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తమ నియోజకవర్గానికి వచ్చిన నిధుల్లో 75 శాతానికంటే ఎక్కువగా ఖర్చు చేశారు.
కేటీఆర్, కొండా సురేఖ మరీ తక్కువ
64 మంది ఎమ్మెల్యేలు 50 - 75 శాతం, 37 మంది ఎమ్మెల్యేలు 25 - 50 శాతం నిధులు ఖర్చు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావులు గత మూడేళ్లలో తమకు వచ్చిన నిధుల్లో 25 శాతానికంటే తక్కువ ఖర్చు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గమైన గజ్వెల్లో 50 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు చేశారు.
రేవంత్, కిషన్ రెడ్డిలు ఖర్చు చేశారు
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జానా రెడ్డి, టిడిపి నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, బిజెపి నేత, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు 75 శాతం కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశారు. ప్రతి ఎమ్మెల్యేకు 2015-16కు రూ.1.50 కోట్లు, 2016-17కు రూ.3 కోట్లు, 2017-18కి రూ.3 కోట్లు వచ్చాయి.
రూ.7.50 కోట్లు... ఎందుకు ఖర్చు చేయడం లేదంటే..
నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి రూ.1.50 కోట్లు ఇస్తుంది. గత మూడేళ్లుగా ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇస్తోంది. తొలుత రూ.1.50 కోట్లు, ఆ తర్వాత ఆ నిధులను రూ.3 కోట్లకు పెంచింది. మూడేళ్లలో ప్రతి నియోజకవర్గానికి రూ.7.50 కోట్లు ఇచ్చింది. వీటిని అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. అయితే, ఇందులో చాలా మొత్తాన్ని ఎమ్మెల్యేలు ఖర్చు చేయడం లేదు. చాలామంది వ్యూహాత్మకంగానే ఖర్చు చేయడం లేదని అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా ప్రజలకు గుర్తుండదని, కాబట్టి ఎన్నికలకు ముందు ఏడాది వీటన్నింటిని ఒకేసారి ఖర్చు చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారని, అందుకే ప్లాన్గా ముందుకెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
75 శాతానికి పైగా ఖర్చు చేసిన వారిలో..
తమ నియోజకవర్గానికి వచ్చిన నిధుల్లో 75 శాతానికి ఎక్కువగా నిధులు ఖర్చు చేసిన వారిలో మంత్రి జోగు రామన్న (అదిలాబాద్), డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజుర్ నగర్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ (గద్వాల్), గీతా రెడ్డి (జహీరాబాద్), బిజెపి ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి (అంబర్ పేట), డాక్టర్ కె లక్ష్మణ్ (ముషీరాబాద్), టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (కొడంగల్), మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (చాంద్రాయణగుట్ట) తదితరులు ఉన్నారు. స్పీకర్ మధుసూదనా చారి తన భూపాలపల్లి నియోజకవర్గంలో 50 శాతం కంటే తక్కువగానే ఖర్చు చేశారు.
కేంద్రం దారిలో.. కేసీఆర్ ఆలోచన
కేంద్రం ప్రతి ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద రూ.5 కోట్లు ఇస్తుంది. ఈ నిధులను రెండు విడతల్లో ఇస్తుంది. మొదటిసారి రూ.2.50 కోట్లు, రెండోసారి రూ.2.50 కోట్లు ఇస్తుంది. ఎంపీ ఎవరైనా నియోజకవర్గంలో తనకు కేటాయించిన రూ.2.50 కోట్లలో రూ.1.75 కోట్లు ఖర్చు చేస్తేనే రెండో వాయిదా ఇస్తుంది. లేదంటే ఆ నిధులు రావు. తద్వారా నిధులు ఆగిపోయే పరిస్థితి ఉండదు. కేసీఆర్ కూడా దీనిని అమలు చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గానికి ఇచ్చిన నిధుల్లో ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని ఖర్చు చేస్తేనే తదుపరి ఏడాది ఫండ్స్ వస్తాయి. కేసీఆర్ దీనిపై ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
అధికార పార్టీలో..
మూడేళ్లలో తమకు వచ్చిన నిధుల్లో 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన ఎమ్మెల్యేలు 4గురు. 25-50 శాతం మధ్య ఖర్చు చేసిన ఎమ్మెల్యేలు 37 మంది. 50-75 శాతం మధ్య ఖర్చు చేసిన వారు 64 మంది. 75 శాతానికంటే ఎక్కువ ఖర్చు చేసిన వారు 15 మంది. సీఎం కేసీఆర్ 50 శాతం కంటే తక్కువ, మంత్రి కేటీఆర్ 25 శాతం కంటే తక్కువ, మంత్రి జోగు రామన్న 75 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేశారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణా రావు, పద్మారావ్, జగదీశ్ రెడ్డిలు 50-75 శాతం మధ్య ఖర్చు చేశారు.