చూపు తగ్గింది, ఆ రోజు సభలో ఏం జరిగిందంటే?: వన్ఇండియా ఇంటర్వ్యూలో స్వామిగౌడ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హెడ్ఫోన్ విసిరిన ఘటన దురదృష్టకరమైందని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ చెప్పారు. ఈ దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ ఘటనకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని స్వామిగౌడ్ చెప్పారు. కానీ, ఆ ఘటన జరిగిన తీరుపై అనేక రకాలుగా కొందరు మాట్లాడిన తీరును తాను పత్రికల్లో చూసి బాధపడ్డానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు.
Recommended Video

అయితే భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా ఉండేందుకు చట్టసభల్లో ఈ తరహ వస్తువులను సభ్యులకు అందుబాటులో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూధనాచారిని కోరానని ఆయన చెప్పారు. మరో వైపు చట్ట సభల్లోని సభ్యులు నైతిక విలువలకు కట్టుబడి క్రమశిక్షణగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తెలంగాణ శాసనసమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ వన్ ఇండియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన పూసగుచ్చినట్టు వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విసిరిన హెడ్ఫోన్ తగిలి శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ ఘటనకు కారణమనే నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభస్పీకర్ మధుసూధనాచారి నిర్ణయం తీసుకొన్నారు.
తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఈవిషయమై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

అసెంబ్లీలో ఏం జరిగిందంటే?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ గుర్తు చేశారు. ప్రసంగం పాఠం ప్రతులను చింపి కొందరు ఎమ్మెల్యేలు పోడియం పైకి విసిరేశారని ఆయన చెప్పారు. హెడ్ఫోన్ విసిరేయడంతో పోడియంపై ఉన్న బల్లను తాకి ఓ ముక్క వచ్చి తన కుడి కంటికి తగిలిందన్నారు. అయితే అప్పుడే కంటికి నొప్పి కలిగిందన్నారు. అదే సమయంలో గవర్నర్ ప్రసంంగం ముగిసి జాతీయ గీతం రావడంతో నొప్పిని పంటిబిగువన అణచుకొన్నానని ఆయన చెప్పారు. జాతీయ గీతం పూర్తికాగానే ప్రోటోకాల్ ప్రకారంగా గవర్నర్ను పంపించేందుకు తానే ముందు నడిచానని ఆయన చెప్పారు. గవర్నర్ను కలిసి వచ్చిన సాగనంపిన తర్వాత అసెంబ్లీలోని వైద్యులు తనను పరీక్షించారని, ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారని ఆయన చెప్పారు.

కంటి చూపు మందగించింది
అసెంబ్లీ నుండి నేరుగా తాను సరోజిని కంటి ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకొన్నానని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ చెప్పారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు తన కంటిలోని కార్నియాకు దెబ్బతగిలిందని గుర్తించారని చెప్పారు. దీనికి చికిత్స చేసినట్టు చెప్పారు. అయితే మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నానన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో తన కంటికి స్కానింగ్ తీసుకొంటే కార్నియాకు తగిలిన దెబ్బ నయమైందని తేలిందన్నారు. అయితే రెండు మాసాల వరకు ఇంకా నొప్పి ఉండే అవకాశం ఉందని సరోజిని కంటి ఆసుపత్రి వైద్యులు స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా చెబుతున్నారన్నారు. కంటికి దెబ్బ తగిలిన తర్వాత చూపు తగ్గిందని ఆయన చెప్పారు. రెండు మాసాల తర్వాత మరోసారి ఆసుపత్రి వద్దకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆ వస్తువులను అందుబాటులో ఉంచొద్దు
చట్టసభల్లో దాడులకు పాల్పడే వస్తువులను ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంచకూడదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి సూచించినట్టు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మైక్లు విరగొట్టే తరహలో ఉండేవని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో అప్పట్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆ తరహ మైక్లను తీసేశారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మైక్లు టేబుల్కు ఫిక్స్ చేసి ఉన్నాయని ఆయన చెప్పారు.హెడ్సెట్లు ప్రస్తుతం ఇస్తున్న పెద్ద సైజులో కాకుండా మొబైల్ఫోన్లకు ఉపయోగించే ఈయర్ ఫోన్లను ఇవ్వాలని తాను సూచించానని ఆయన చెప్పారు. చర్చల సందర్భంగా సభ్యులు సహనం కోల్పోయిన సందర్భంలో అందుబాటులో ఉన్న వస్తువులను విసిరేసి అవకాశం ఉన్నందున ఆ తరహ వస్తువులు లేకుండా చూడాలని తాను కోరినట్టు ఆయన చెప్పారు.

ఆ మాటలు బాధించాయి
హెడ్ఫోన్ తగిలిన తర్వాత ఆసుపత్రిలో తాను చికిత్స చేసుకొంటున్న సమయంలో కొందరు మాట్లాడిన తీరు తనకు బాధ కల్గించిందని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ చెప్పారు. ఎడమ కంటికి దెబ్బతగిలిందని, ఆ తర్వాత కుడి కంటి దెబ్బ తగిలిందని రకరకాలుగా మాట్లాడినట్టుగా తాను వార్తాపత్రికల్లో చూసి తీవ్రంగా కలత చెందినట్టుగా స్వామిగౌడ్ చెప్పారు. హెడ్ఫోన్తో ఎవరితోనైనా విసిరిస్తే దెబ్బ తగులుతోందో లేదో తెలుస్తోందని స్వామిగౌడ్ చెప్పారు. తన గురించి ఈ రకంగా మాట్లాడిన వారి విచక్షణకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.

అలా చేస్తే సరిపోయేది
తనకు హెడ్ఫోన్ తగిలిన వెంటనే ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయమై దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే పరిస్థితి మరోలా ఉండేదేమోనని శాసనసమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. పశ్చాత్తాపం కటే పెద్ద శిక్ష మరోటి ఉండదన్నారు. ఈ రకమైన సంప్రదాయం నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, ఈ ఘటనలో అలా జరగలేదన్నారు.తనపై దాడికి పాల్పడిన వారి వైపు నుండి ఈ తరహ స్పందన వస్తే తాను కూడ ఆలోచించేవాడినని ఆయన చెప్పారు. కానీ, ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. దీంతో తాను ఈ విషయమై ఎక్కువగా వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు.

షబ్బీర్ అలీ బాధపడ్డారు.
తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు వచ్చి తనను పరామర్శించారని చెప్పారు. తనను పరామర్శించిన సమయంలో షబ్బీర్ అలీతో పాటు, సుధాకర్ రెడ్డి కూడ బాధపడ్డారని ఆయన చెప్పారు. కానీ, తనను వారు పరామర్శించడానికి వచ్చిన సమయంలో వారికి ధన్యవాదాలు తెలిపానని ఆయన చెప్పారు.

సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాలి
చట్టసభలంటే దేవాలయాల వంటివని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ చెప్పారు. ఆ దేవాలయాల్లో సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాలన్నారు. నైతిక విలువలకు కట్టుబడి తమకు తాము నియంత్రణ విధించుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహ ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేవిగా ఉంటాయని ఆయన చెప్పారు. నిరసనలు కూడ ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications