టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసు.. ముగ్గురు నిందితుల బెయిల్ పిటీషన్లపై నేడే విచారణ; ఉత్కంఠ!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టు నవంబర్ 11 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, డబ్బులతో పార్టీ మార్చాలని ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో రామ చంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజీలను అరెస్ట్ చేసి పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అయితే తమ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ కావాలని వారు ముగ్గురు పిటీషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరగనుంది.

నేడు ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసు నిందితుల బెయిల్ పిటీషన్ల విచారణ
నిందితులు ముగ్గురూ తమ అనారోగ్య కారణాలతో బెయిల్ కావాలని దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి నేడు వారి బెయిల్ పిటీషన్ ల విచారణలో ఏసీబీ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో స్వామీజీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఏ మాత్రం తగ్గటం లేదు.

ఎమ్మెల్యేల ఫిర్యాదుతో నమోదైన కేసు.. బెయిల్ కోసం నిందితుల యత్నం
సైబరాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ముగ్గురు నిందితులను రిమాండ్ కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వారిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచగా వారికి నవంబర్ 11 వరకు రిమాండ్ విధించింది కోర్టు. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు , పైలెట్ రోహిత్ రెడ్డిలు పార్టీ మారటానికి డబ్బులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టి పార్టీ మార్చటానికి ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేయాగా నమోదైన కేసులో ఇప్పుడు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

జేపీ పిటీషన్ పై నవంబర్ 4న విచారణ జరపనున్న హైకోర్టు
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బిజెపి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసేవరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications