బీఎల్ సంతోష్ తరువాత లిస్టులో ఎవరు - కమలం పార్టీలో కలకలం..!!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కలకలం. బీజేపీ ముఖ్యనేతలకు నోటీసులు జారీ అవుతున్నాయి. బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా పేరున్న బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ నోటీసుల జారీ జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కీలకంగా ఉన్న బీఎల్ సంతోష్ కు 41ఏ నోటీసులు ఇవ్వటం సాధారణమైన విషయం కాదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారనే అభయోగాలతో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు బీఎల్ సంతోష్ పేరు ప్రస్తావించారు.

బీఎల్ సంతోష్ తరువాత ఎవరు...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వారు నెంబర్ 1, నెంబర్ 2 కూడా సంతోష్ ఇంటికి వచ్చి చర్చలు చేస్తారంటూ చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఈ నెల 21న విచారణకు రావాలంటూ బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసింది.
అందులో ఫోన్ నెంబర్ తో సహా సూచించింది. ఫోన్ IMEI నెంబర్ ను కూడా అందులో స్పష్టం చేసారు. సహకరించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో బీఎల్ సంతోష్ తో పాటుగా బండి సంజయ్ కు సన్నిహితుడుగా పేరున్న శ్రీనివాస్ కు నోటీసులు అందాయి. ఈ ఇద్దరి నోటీసులు రద్దు చేయాలని,వీరికి కేసుతో సంబంధం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.

జాతీయ స్థాయిలో చర్చగా నోటీసుల వ్యవహారం
బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వటం ద్వారా ఈ కేసులో ఏ స్థాయికి అయినా వెళ్లాలని డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. బీఎల్ సంతోష్ బీజేపీ వ్యవహారాల్లో కీలక పాత్రో పోషించే వ్యక్తే అయినా.. ప్రచారానికి దూరంగా ఉంటారు. కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి నోటీ నుంచి ఆడియో..వీడియోల్లో పలు మార్లు సంతోష్ పేరు ప్రస్తావనకు వచ్చింది. హైకోర్టులో రిలీఫ్ దొరక్కుంటే బీఎల్ సంతోష్ సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, బీఎల్ సంతోష్ విషయంలో సిట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠను పెంచుతోంది. అయితే, ఇప్పుడు సంతోష్ తరువాత ఇంకా లిస్టులో ఎవరున్నారు.. ఇంకా నోటీసులు ఎవరికైనా జారీ అవుతాయా అనేది ఆసక్తి కర చర్చగా మారుతోంది.

వేగంగా సిట్ అడుగులు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసిన సమయంలోనే సీఎం కేసీఆర్ ఈ విషయంలో ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి దేనికైనా సిద్దమేనని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసులు విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటుగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్ లకు పంపినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అదే విధంగా.. అన్ని రాజకీయ పార్టీలకు పంపారు. ఇప్పుడు సిట్ వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications