ఉచితాలు పేదలకు ఇచ్చే పథకాలు కాదు.. కార్పోరేట్లకు మీరిచ్చేవి: కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలు ఉచితాలు అన్న వ్యాఖ్యలపై కవిత తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఎప్పుడూ ఉచితమేనని, ఇది సామాజిక బాధ్యత అని అన్నారు.
పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఉచితాలు కావు
పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, డూప్ ఏజెన్సీలకు కేంద్రం ఇస్తున్న రుణమాఫీ అసలైన ఉచితమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో పేదల కోసం 250 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను 'ఉచితాలు'గా అభివర్ణించే ధోరణి ఉందని ఆమె తెలిపారు.
కార్పోరేట్ వ్యక్తుల కోసం చేసిన రుణమాఫీ ఉచితం అవుతుంది
పేదలకు అందించే సంక్షేమ పథకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని కవిత వ్యాఖ్యానించారు. తాము ఈ ప్రవర్తనకు వ్యతిరేకం అని కవిత తేల్చి చెప్పారు. పేదల సంక్షేమం ఏ ప్రభుత్వానికైనా బాధ్యత అని పేర్కొన్నారు కవిత. బిజెపి ప్రభుత్వం బ్యాంకులను మోసం చేసే కార్పొరేట్ వ్యక్తుల కోసం రూ. 10 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని వెల్లడించారు. అది ఉచిత మౌతుంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను ఉచితాలు గా పిలిచి పేద ప్రజలను అవమాన పరచడం మంచిది కాదని ఆమె సూచించారు.
సంక్షేమ పథకాలు అమలు చెయ్యొద్దని భావిస్తే సరైన ఉపాధి చూపించండి
సంక్షేమ పథకాలు అమలు చెయ్యొద్దు అని కేంద్రం భావిస్తే పేదలకు సరైన ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు ఉపాధి కల్పించలేనప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిందేనని కవిత పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, దేశంలోని మేధావి వర్గం తలెత్తుకుని, నేడు దేశంలో ఏర్పడుతున్న ఈ వాతావరణాన్ని వ్యతిరేకించాలని తాను అభ్యర్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
బలహీనవర్గాలకు సహాయం అందించటం ప్రభుత్వ బాధ్యత
భారతదేశం అన్ని నేపథ్యాల ప్రజలతో విభిన్నమైన దేశం అన్నారు కవిత. పేదరికాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ప్రగతి చక్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బలహీన వర్గాలకు సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలని, కేంద్రం ఎలాంటి ఆటంకం కలిగించకూడదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.