బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్.. బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత!!
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కవిత తెలంగాణ బతుకమ్మను అవమానించారని, బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేశారని, తెలంగాణ తల్లిని కించపరిచిన కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఇరుక్కుని అనుభవిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు.

బండి సంజయ్ పదవికి మచ్చ తెచ్చేలా ఆయన వ్యాఖ్యలు
తనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పిన కవిత, బండి సంజయ్ ఉపయోగించే పదజాలం చాలా అవమానకరంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సరైన సమయంలో తెలంగాణ ప్రజలు బీజేపీని తిప్పికొడతారని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

తనను ఆ మాట ఎంతగానో బాధించింది
మహిళలను అవహేళన చేస్తూ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కవిత స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగను కూడా అవమానించే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని అది తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్న కవిత, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ ఒక స్వతంత్ర పార్టీ అని, కేసీఆర్ మానస పుత్రిక బీఆర్ఎస్ పార్టీ అని కవిత పేర్కొన్నారు.

బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా
బీఆర్ఎస్ పార్టీలో ఏకైక స్టార్ కెసిఆర్ అంటూ పేర్కొన్న ఆమె, తాను ఆయన సైనికురాలినని, ఆయన ఆదేశిస్తే బి ఆర్ ఎస్ లో ఏ పాత్ర ఇచ్చినా దేశం కోసం పని చేస్తానని తెలిపారు. కెసిఆర్ త్వరలో బలీయమైన శక్తిగా మారతారని పేర్కొన్న కవిత దేశంలోని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై, నెలకొన్న సమస్యలపై తాము సరైన సమయంలో స్పందిస్తామని కవిత తెలిపారు.

దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుంది
అంతే కాదు ప్రస్తుతం ఎన్డీయేకు స్నేహితులు ఎవరూ లేరని మిత్రులను మింగడమే బిజెపికి మొదటి నుంచి తెలిసిన విద్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ మంచి వేదిక అవుతుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది తమ నినాదమని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications