బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్.. జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణ జాగృతి ఉద్యమాలకు తలొగ్గి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. ఇది జాగృతి విజయంగా భావిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటన నేపథ్యంలో ఈ నెల 17న చేపట్టిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ, కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టామన్నారు.
ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రభుత్వ నిర్ణయం జాగృతి విజయమని.. ఆర్డినెన్స్ తెచ్చేవాళ్లు ఇన్నాళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని తాము భావిస్తున్నామన్నారు. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించకపోతే మళ్లీ పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. గురువారం నాటి కేబినెట్ భేటీలో రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ప్రస్తావించారని.. విద్య, ఉద్యోగాల్లో మీ వైఖరేంటని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు చేయాల్సింది చేయకుండా కాంగ్రెస్ను మాత్రమే దోషిగా నిలబెడుతున్నారని మండిపడ్డారు.

బీసీ బిడ్డగా బండి సంజయ్ ముందుండి బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని.. వారం రోజుల పాటు ప్రభుత్వాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటామన్నారు. ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసి ఆర్డినెన్సుపై ముందుకు వెళ్లాలని.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందా లేదా అనేది వారంలో తెలిసిపోతుందన్నారు. లేదంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని కవిత హెచ్చరించారు. దీనిపై ముందుకెళ్లకపోతే రైల్ రోకో చేపడతామని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications