రాజ్భవన్ను రాజకీయ వేదికగా మార్చారు: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి గవర్నర్ కార్యాలయాన్ని 'రాజకీయ వేదిక'గా మార్చారని గవర్నర్ తమిళిసై పై టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ గారిని అపఖ్యాతిపాలు చేయడానికి ఆమె రాజ్ భవన్ ను వినియోగిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇక రాష్ట్రంలో తప్పుడు ప్రచారం తో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేము అని గ్రహించిన బిజెపి, గవర్నర్ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

గవర్నర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎమ్మెల్సీ కవిత
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కార్యాలయం "అవమానానికి గురైందని" తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు పలువురు గవర్నర్ బిజెపికి అనుకూలంగా పని చేస్తున్నారని, ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్ తన స్థాయికి తగ్గట్టు హుందాగా ప్రవర్తించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని విమర్శించడమే గవర్నర్ పనిగా పెట్టుకున్నారని, ఎక్కడ ఏ కార్యక్రమాలకు వెళ్లినా బిజెపి నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

రాజ్ భవన్ వేదికగా మూడేళ్ళు అవమానాలు భరించానంటూ గవర్నర్ సంచలనం
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న రాజ్ భవన్ లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా గవర్నర్ కార్యాలయానికి అవమానాలు జరుగుతూనే ఉన్నాయని, అన్నిటినీ భరించి, అన్నిటినీ అధిగమిస్తూ తాను ప్రజాసేవలో ముందుకు వెళ్తూనే ఉన్నానని, తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరు దెబ్బతీయలేరని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణాలో అనేక అంశాలపై ఘాటుగా గవర్నర్ తమిళిసై
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జెండాను ఎగురవేసేందుకు అనుమతించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఇతర సమస్యలను కూడా తమిళిసై లేవనెత్తారు. ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని, ఓ ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరుతున్నారని గవర్నర్ ఎద్దేవా చేశారు. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు కవిత చేసిన ట్వీట్ల ద్వారా టీఆర్ఎస్ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చింది.

తెలంగాణాలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ.. కొనసాగుతున్న రచ్చ
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని రాష్ట్ర అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తనను తాను బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా చూపిస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం మతం పేరుతో ప్రజల విభజనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మేధావులు మరియు ఆలోచనాపరులను తనతో కలిసి రావాలని ఇటీవల ఒక సమావేశంలో ఆయన ఆహ్వానించారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం పలు అంశాల్లో విఫలమైందని, రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని, ముందు రాష్ట్రాన్ని దిద్దు తర్వాత దేశ రాజకీయాలు అంటూ బిజెపి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.












Click it and Unblock the Notifications