'లైగర్' సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడి??
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లైగర్' సినిమా పరాజయం పాలైనప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమా చుట్టూ రాజకీయాలు నెలకొంటున్నాయి. సినీ నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టారని జడ్సన్ ఆరోపించారు. తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని, విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు.
'లైగర్' సినిమాకు కథానాయిక ఛార్మి, బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కవిత పెట్టుబడి పెట్టిందంటూ ఫిర్యాదుల చేయడం వెనక ఈ సినిమాపై ఇంకా ఎంతమంది పెట్టుబడి పెట్టివుంటారనే విషయమై ఈడీ దృష్టిసారించిందని జడ్సన్ తెలిపారు. ఒకవేళ ఈడీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటే కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి అగ్ర కథానాయకుల సినిమాలు భారీ బడ్జెట్తో రూపొందిస్తారు. ఆయా చిత్రాలకు తెరపై కనపడేవారే కాకుండా తెరవెనక పెట్టుబడి పెట్టేవారు కూడా ఎంతోమంది ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'లైగర్'కు కూడా పెట్టుబడులు ఇలాగే పెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు జరిగితే మరికొందరి పేర్లు బయటకు వస్తాయంటున్నారు.