మోడీని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇంతే: ఎమ్మెల్సీ కవిత; ఈడీ విచారణపై కీలక వ్యాఖ్యలు!!
మోడీని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇంతే అని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు. నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
ఈడీ విచారణకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కవిత దేశ రాజధాని ఢిల్లీలో మెరీడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించే వరకు పోరాటం చేయాలని నిర్ణయించినట్టు కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కవిత మహిళలకు తమ పార్టీతో సహా ఏ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొన్ని పార్టీలు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు.

ఈడీ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: ఎమ్మెల్సీ కవిత
ఇక నేడు ఈడి విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే మోడీని ప్రశ్నిస్తే ఇలాగే ఉంటుందంటూ ఆమె వ్యాఖ్యానించారు ఈడి ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని పేర్కొన్న కవిత, తను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. సి ఆర్ పి సి సెక్షన్ 160 ప్రకారం ఒక మహిళను విచారణ చేసేటప్పుడు ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాలని, కానీ ఈడి అధికారులు కార్యాలయానికి పిలుస్తున్నారు అంటూ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడతానని ఆమె వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించే వరకు పోరాటం చేస్తాం
ఇక ఈడి విచారణని పక్కన పెడితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాత్రం పార్లమెంట్లో ఒత్తిడి తీసుకువస్తామని, ఆ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసిన ధర్నాకు ఆహ్వానించామని, కానీ కాంగ్రెస్ నుండి ఎటువంటి స్పందన లేదని కవిత తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తామన్నారు కవిత. రైతు ఉద్యమం తరహాలో మహిళా బిల్లు కోసం ఉద్యమిస్తామని కవిత వెల్లడించారు. పార్లమెంట్ లో , వెలుపల కూడా పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు సాధన కోసం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.

నేడు ఈడీ విచారణకు కవిత
ఈడీ విచారణ పై మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినా పిటిషన్ విచారిస్తామని పేర్కొన్న కోర్టు, కవిత వేసిన పిటీషన్ ను అత్యవసరంగా విచారించడం కుదరదని స్పష్టం చేసింది. కవిత వేసిన ఎమర్జెన్సీ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈనెల 24వ తేదీన విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించడంతో నేడు ఈడి విచారణకు కవిత హాజరు కావలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

కవిత విచారణ నేపధ్యంలో మళ్ళీ ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన కేసులో ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు .దాదాపు 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారణ జరిపారు. మళ్లీ ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు రావాలని ఆదేశించడంతో, నేడు మళ్ళీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కవిత విచారణ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications