కేంద్ర కేబినెట్లో తెలంగాణకు ప్రాధాన్యత: ధర్మపురి అరవింద్ పేరు ప్రచారంలో: రాత్రికల్లా లిస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతోన్నారు. దీనికి సంబంధించిన తుది జాబితాపై ఈ సాయంత్రం మోడీ ఆమోదముద్ర వేయనున్నారు. దీనికోసం కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. దాదాపుగా ఈ రాత్రికే మంత్రివర్గ జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు దేశ రాజధానిలో చక్కర్లు కొడుతోన్నాయి. దీనికి అనుగుణంగా ఆశావహులు ఒక్కొక్కరు హస్తినకు చేరుకుంటోన్నారు.
ఏపీ నుంచి జీవీఎల్..
ఈ సారి విస్తరణలో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏపీ నుంచి జీవీఎల్ నరసింహా రావుకు కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైందనే వార్తలు వెలువడుతోన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్.. సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటోన్నారు. జాతీయ స్థాయిలో ఆయనకు పేరు ఉంది. ఉత్తర ప్రదేశ్ కోటా నుంచి ఆయనకు రాజ్యసభకు పంపించింది బీజేపీ అధిష్ఠానం. ఏపీకి ప్రాతినిథ్యాన్ని కల్పించే విషయంలో ఆయన తప్ప మరొక పేరు అందుబాటులో ఉండట్లేదు కూడా. సీఎం రమేష్ పేరు కూడా వినిపిస్తోన్నప్పటికీ- ఆయన తెలుగుదేశం పార్టీ నేపథ్యాన్ని కలిగి ఉండటం మైనస్ పాయింట్గా మారొచ్చని అంటోన్నారు.
తెలంగాణకు ప్రాధాన్యత..
ఏపీకే చెందిన కంభంపాటి హరిబాబుకు గవర్నర్గా నియమించింది. ఏపీతో పోల్చుకుంటే- తెలంగాణలో బీజేపీ అత్యంత క్రియాశీలకంగా ఉంటోంది. లోక్సభకు నలుగురు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డికి.. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియో లభించింది. హోం శాఖ సహాయ మంత్రి హోదాలో కొనసాగుతోన్నారు. అదే సమయంలో- మంత్రివర్గంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే- నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అరవింద్కు చోటు..
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. జెయింట్ కిల్లర్గా ఆయనకు పేరు ఉంది. అప్పటి సిట్టింగ్ లోక్సభ సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవితను ఓడించడంతో దేశవ్యాప్తంగా అరవింద్ పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత కూడా అరవింద్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటోన్నారు. భూఆక్రమణ ఆరోపణలతో తన మంత్రి పదవికి, పార్టీకీ రాజీనామా చేసిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించినట్లు భావిస్తోంది అధిష్ఠానం.
Recommended Video
హస్తిన చేరుకుంటోన్న నేతలు
ఆయనకు మంత్రి పదవిని అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం చేసినట్టవుతుందని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిన నాయకులు హస్తిన బాట పట్టారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, యువనేత జ్యోతిరాదిత్య సింధియా దేశ రాజధానికి బయలుదేరారు. హిమంత బిశ్వశర్మ కోసం తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు శర్బానంద సొనొవాల్. ఆ ఉద్దేశంతోనే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. అలాగే- మంత్రి పదవి ఇస్తామనే భరోసాతోనే జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేర్చుకున్నారనేది తెలిసిన విషయమే.