మోడీ కేసీఆర్ పేరెత్తరు కానీ ఆయన భజనగణం మూకుమ్మడిగా దాడిచేస్తారా? మంత్రి ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ తీరుపై, బిజెపి నేతలు వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బిజెపి జాతీయ నేతలు జాతీయ సభలకు వచ్చారా? తెలంగాణపై దాడి కోసం దిగారా? అంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు.
సమావేశాల పేరుతో దాడి చేస్తారా ? బీజేపీపై భగ్గుమన్న మంత్రి ఎర్రబెల్లి
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రవర్తించిన తీరు, దిగిన మాటల దాడిపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సభలు పెట్టుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని, కానీ, సభల పేరుతో మా తెలంగాణ ప్రభుత్వంపై, మా సిఎం కెసిఆర్ పై చేసిన దాడి అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి మొత్తం తెలంగాణ ప్రజానీకంపై జరిగినదిగా భావిస్తున్నామన్నారు.
మోడీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని మండిపడిన మంత్రి
మోడీ కెసిఆర్ పేరు ఎత్తరు. కానీ, ఆయన భజన గణం అంతా కలిసి, ప్రత్యక్షంగా తెలంగాణ సీఎం కెసిఆర్ పై దాడి చేసి, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మోడీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. బిజెపికి తెలంగాణపై అధికారం యావ తప్ప, ప్రజలు, అభివృద్ధి, సంక్షేమాలపై లేదని మరోసారి తేలిందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దక్షిణాది పైన కూడా బీజేపీ చిన్నచూపు చూస్తుందని, కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తుందని, బీజేపీ వైఖరి స్పష్టం అవుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
బీజేపీ నేతల ఆటలు తెలంగాణలో సాగవన్న ఎర్రబెల్లి
అబద్ధాలు వల్లించడం, మోసం చేయడం, మత విధ్వేషాలు రెచ్చగొట్టి, ఇప్పుడు దేశ భక్తి సెంటిమెంట్లను బాగా పండించి ఓట్లు దండుకునే రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక బీజేపీ నేతల ఆటలు తెలంగాణలో సాగవని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఉత్తర భారత దేశంలో సాగినట్టు తెలంగాణలో బిజెపి ఆటలు సాగవని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బిజెపికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.