కారుతో దూసుకెళ్లిన బీటెక్ విద్యార్థులు: యువతి మృతి, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: పంజాగుట్ట రోడ్డు ప్రమాద ఘటన మరువక ముందే అలాంటి దుర్ఘటనే మరోటి చోటు చేసుకుంది. పంజాగుట్ట ప్రమాదంలో యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా చిన్నారి రమ్యతోపాటు ఆమె బాబాయ్, తాత మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో విద్యార్థిని ప్రాణం బలిగొన్నారు ముగ్గురు బీటెక్ విద్యార్థులు. మరో యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన అనిత(20), పరిగిలోని ప్రేమ్నగర్ కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న, పూడూర్ మండలంలోని అంగడి చిట్టెంపల్లికి చెందిన సోనీ.. మొయినాబాద్ మండల పరిధిలోని చిల్కూరులోని వికాస్ డీఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.
మంగళవారం వీరు ముగ్గురు కలిసి కళాశాలకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బస్టాప్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రిక్వెస్ట్ బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే వారిమీదకు దూసుకెళ్లింది ఓ కారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, ఆ కారును నడుపింది.. హైదరాబాద్లోని మెహిదీపట్నానికి చెందిన రాహుల్, సయ్యద్. కాలీమందిర్ వద్ద గల షాదన్ ఇంజనీరింగ్ కళాశాలలో వారిద్దరూ బీటెక్ చుదువుతున్నారు. మంగళవారం వారు మొయినాబాద్లో స్నేహితుడి వద్దకు వచ్చి తిరిగి వెళుతున్నారు. సయ్యద్ అతివేగంగా నడపడం వల్ల కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి పోలీస్టేషన్ ముందున్న విద్యుత్ స్తంభాన్ని.. మరింత ముందుకెళ్లి కళాశాల బోర్డులను.. బస్టాపులో ఉన్న విద్యార్థినులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అనిత, లక్ష్మీప్రసన్న తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగం ధాటికి సోనీ పక్కకు ఎగిరిపడటంతో ఆమెకు త్రుటిలో ముప్పు తప్పినట్టయింది. ఇక, కారులో ఉన్న రాహుల్కూ స్వల్పగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన సయ్యద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాద సమయంలో అతడు మద్యం తాగి ఉన్నాడా లేదా అనేదానిపై, ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.