ఆత్మహత్య: ఏపీ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల్లో నలిగి తల్లీకూతుళ్ల మృతి
హైదరాబాద్: ఏపీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి శుక్రవారం ఉదయం బయల్దేరిన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంద్రమర్రి-మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ క్రమంలో రైలు నుంచి దూకిన వారిద్దరూ రైలు చక్రాల్లో ఇరుక్కుపోయారు. ట్రైన్ రన్నింగ్లో ఉండగా జరిగిన ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన రైల్వే సిబ్బంది మంచిర్యాలలో రైలును ఆపేశారు.
ఆ తర్వాత ఇంజన్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. మంచిర్యాల జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఏపీ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో గుర్తుతెలియని మహిళతో పాటు ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించామన్నారు.
లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. దీంతో వారిద్దరి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాలను తీసిన అనంతరం రైలు 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.