కొత్త కోణం: సిమి ఉగ్రవాదంలో కొడుకు, వెంటే తల్లి
హైదరాబాద్: సిమి ఉగ్రవాదానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో ఇద్దరు సిమి ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్న వారిలో మరో ముగ్గురు ఉండి ఉంటారని పోలీసులు భావించారు. అయితే, వారు ముగ్గురు కాదని, అయిదుగురు ఉండి ఉంటారని తాజాగా పోలీసులు భావిస్తున్నారు. అందులో ఓ మహిళ కూడా ఉందని తెలుస్తోంది.
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరు తరుచూ మకాంలు మారుస్తుంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు వేట సాగిస్తున్నారు. సూర్యాపేటలో ఇద్దరు పోలీసులను హత్య చేసిన అనంతరం నల్గొండ ఎన్ కౌంటర్లో ఎజాజుద్దీన్, అసాలంలు మృతి చెందారు. వారు మధ్య ప్రదేశ్ ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్న వారే.
ఏడుగురు ముఠా సభ్యులు తప్పించుకున్నప్పటికీ ఇద్దరు పట్టుబడ్డారు. ఐదుగురిలో ఎజాజ్, అస్లాంలు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. మహబూబ్, అజాజ్, జకీర్లు పరారీలో ఉన్నారు. వీరి కోసం ఎనిమిది రాష్ట్రాల పోలీసులు కేంద్ర నిఘా విభాగం గాలిస్తున్నాయి.
వీరు ముగ్గురితో పాటు కొంతకాలం క్రితం ఈ ముఠాతో పని చేసిన సాలక్ అలియాస్ సల్లూ అనే మరో ఉగ్రవాది కూడా వీరితో కలిశాడని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ముటా సభ్యుడైన మహబూబ్ తల్లి నజ్ మాబీ కూడా వీరితోనే ఉంటోందని తేలింది.
మధ్యప్రదేశ్లోని బిజ్నూర్లో ఓ ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో మహబూబ్ గాయపడ్డాడు. అతనికి చికిత్స చేసేందుకు మిగతా వారు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మహబూబ్ చికిత్స తీసుకుంటూనే దేశవ్యాప్తంగా సంచరిస్తున్నాడు. అతనితో పాటు తల్లి కూడా ఉంటూ సపరిచర్యలు చేస్తోందని పోలీసుల వచారణలో తేలిందని సమాచారం.