రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలి: కవిత డిమాండ్
ఢిల్లీ: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిషికేశ్వరి అనే విద్యార్థిని సీనియర్ల వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపి కవిత డిమాండ్ చేశారు.
ఏపి సిఎం చంద్రబాబునాయుడు దురుద్దేశంతోనే స్పందించడం లేదని విమర్శించారు. శుక్రవారం హైకోర్టును విభజించాలంటూ పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపీలు మౌన ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టును విభజించే వరకు ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రా ప్రాంత విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ సబబేనని, వారికి జీతాలు చెల్లించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కవిత వ్యాఖ్యానించారు.
అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆమె కలిశారు. ఉద్యోగుల విభజన త్వరగా చేయాలని రాజ్నాథ్కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన జరగకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదవుతున్నా.. హైకోర్టు ఏర్పాటు, ఉద్యోగుల విభజనపై కేంద్రం స్పందించడం లేదని అన్నారు.
కాగా, లిబియాలో చిక్కుకున్న అధ్యాపకుడిని విడిపించేందుకు విదేశాంగశాఖతో మాట్లాడుతున్నామని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కవిత తెలిపారు.