తేల్చుకుందాంరా: బాబుపై కవిత, బెదిరింపులా: కిషన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు. మహానాడు రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తోందన్నారు. సినిమా సెట్టింగులు వేసి, సినిమాను తలపించేలా మహానాడు ఉందని, అది వారి సంస్కృతి అన్నారు.
అమరవీరులను ఉద్దరిస్తామని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. మామను చంపి మాలలు వేయడం చంద్రబాబు ప్రారంభించారని, ఇప్పుడు ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న పార్టీలో ఉన్న వారు ఉద్యమకారుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం విడిపోతే దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతామన్నారు.
బెదిరిస్తున్నారు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి బెదిరింపులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం ఆరోపించారు. తమ పార్టీలో చేరాలని ఇతర పార్టీల వారిని బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి లక్ష్మణ రేఖ ఉండాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ రేఖ దాటుతోందన్నారు.