కేసీఆర్ చేతులెత్తేశారు... మీరు జోక్యం చేసుకోవాల్సిందే.. మోదీకి రేవంత్ లేఖ
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో అటు ప్రతిపక్షాలు,ఇటు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేసీఆర్ సర్కార్ కరోనా నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిందని... ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇక్కడ కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ ద్వారా కోరారు.

ఎవరి ఆదేశాలను కేసీఆర్ లెక్క చేయట్లేదన్న రేవంత్...
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని... రాబోయే రోజుల్లో హైదరాబాద్ హాట్ స్పాట్గా మారే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలను, హైకోర్టు ఆదేశాలను, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,వైఫల్యం కారణంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారబోతుందని... కాబట్టి కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

తెలంగాణలో 27శాతం...
దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ రేటు 22శాతం ఉంటే, తెలంగాణలో 27శాతం ఉందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి దేశ, విదేశాలకు ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. రాష్ట్ర పొరుగు రాష్ట్రం ఏపీలో ఇప్పటివరకూ 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే... ఇక్కడి ప్రభుత్వం మాత్రం
ఇప్పటివరకూ కేవలం 70వేల కరోనా పరీక్షలు మాత్రమే చేసిందన్నారు.

టెస్టుల విషయంలో అలసత్వం...
ల్యాబ్లపై ఒత్తిడి పెరిగిందన్న సాకుతో గత 4 రోజులుగా రాష్ట్రంలో అసలు టెస్టులే చేయట్లేదని రేవంత్ పేర్కొన్నారు. చేసిన టెస్టులకు సైతం ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని... దాంతో వ్యాధి ముదిరి మరణాల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఏపీలో 42 ట్రూనాట్ కిట్స్ ఉంటే తెలంగాణలో 22 మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

అలంకారప్రాయంగా టిమ్స్...
తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆస్పత్రి కేవలం అలంకారప్రాయంగా ఉందని... కోవిడ్ 19 స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉన్న గాంధీలో అనేక సమస్యలు ఉన్నాయని మోదీ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ... ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోవట్లేదని పేర్కొన్నారు. వెంటనే వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

వాటిని ఉపయోగించుకోవట్లేదని...
కార్పోరేటు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకునేంత స్తోమత లేని నిరుపేదలకు నగరం చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీల్లో క్వారెంటైన్,చికిత్స అందించాలన్నారు. కానీ వీటిల్లో చాలా వరకు సీఎం కేసీఆర్ బంధువులు, మంత్రులు, వారి బంధువులకు చెందటంతో వాటిని ఉపయోగించుకోవటం లేదని అన్నారు. మెడికల్ వేస్ట్ కుప్పలుగా పేరుకుపోయిందని... మానవ హక్కుల సంఘం దీనిపై సుమాటో కేసును విచారిస్తోందని చెప్పారు. ఇకనైనా కేంద్రం కల్పించుకోకపోతే హైదరాబాద్లో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Recommended Video

ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఫైర్...
తాజాగా హైకోర్టు కూడా మరోసారి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుంటే... ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచకుండా తాత్సారం చేయడం ప్రజల జీవించే హక్కును కాలరాయడమేనని అభిప్రాయపడింది. కరోనా నియంత్రణ,వైద్య సిబ్బంది పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవట్లేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.మే 23 నుంచి జూన్ 23 వరకు రాష్ట్రంలో మొత్తం ఎన్ని కరోనా టెస్టులు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు నిర్వహించారో లెక్కలు చెప్పాలని అదేశించింది. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు...? జూన్ 26 నుంచి టెస్టులు ఎందుకు అపేశారు? అని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications