నేటితో మునుగోడు ప్రచారానికి తెర.. సాయంత్రానికి మైకులు బంద్; వారు వెళ్ళిపోవాలని ఈసీ హుకుం!!
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేటితో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు మాత్రమే కాక, రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మునుగోడు లో గెలిచేదెవరు? మునుగోడులో పట్టు సాధించేది ఎవరు? మునుగోడుపై జెండా ఎగురవేసేది ఎవరు అన్నది? అందరిలోనూ జరుగుతున్న ప్రధానమైన చర్చ.

పీక్స్ కు చేరిన మునుగోడు ఉప ఎన్నికల పోరు
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుండి మునుగోడు ఉప ఎన్నికల పోరు కొనసాగింది. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మునుగోడు ఉప ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారం లోనే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నానారకాలుగా ప్రయత్నించారు. దసరా దీపావళి పండుగలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రతి పండుగకు మునుగోడు ఓటర్లకు తోఫా ఇచ్చి వారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విందులు, వినోదాలు, మందు పార్టీలతో హోరెత్తించారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు
ఇక మునుగోడులో ఏ పార్టీకి ఆ పార్టీ తమ జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పం తో చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయి అనేది ఈ వారం రోజుల్లోనే తేలనుంది. నవంబర్ 3వ తేదీన గురువారం నాడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడుతుందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం తో నియోజకవర్గంలో ప్రచారాన్ని ఆపివేయాలని, సోషల్ మీడియాలో కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచారం చెయ్యొద్దని సూచిస్తున్నారు.

బయట వ్యక్తులు మునుగోడులో ఉండరాదు
ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తూ ఈరోజు సాయంత్రం తర్వాత నియోజకవర్గంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఇక నేడు సాయంత్రం తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాలతో నేడు సాయంత్రం 5 గంటలకు మునుగోడులో మైకులు మూగబోనున్నాయి. ఇక మునుగోడు పోలింగ్ సంబంధించి మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 1192 మంది సిబ్బంది అవసరం ఉండగా అదనంగా మూడు వందల మందిని నియమించినట్టు తెలిపారు .

చివరి రోజు ప్రచార పర్వం సాగుతుంది ఇలా..
ఇక చివరి రోజైన నేడు ప్రచార పర్వంలో మునుగోడు దద్దరిల్లబోతోంది. టిఆర్ఎస్ పార్టీ నుండి నేడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రి కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. వారిరువురు నియోజకవర్గంలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ తరపున రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు లో నేడు నిర్వహిస్తున్న మహిళా గర్జన సభకు టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇక నేటితో ప్రచారానికి తెరపడనుండడంతో ఇక అందరి దృష్టి పోలింగ్ పై ఉండనుంది. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జోరందుకోనున్నాయి.












Click it and Unblock the Notifications