సికింద్రాబాద్ బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అమిత్ షా భోజనం: టూర్లో సడన్ ఛేంజ్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి వస్తోన్న ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలవడానికి అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటోన్నాయి. దీనితో మునుగోడు హాట్ హాట్గా మారింది.
హాట్ సీట్..
ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హోరాహోరిగా పోరు మొదలు పెట్టాయి. నాగార్జున సాగర్ మినహాయిస్తే- ఇదివరకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోయిన ప్రతిష్ఠను తిరిగిపొందడానికి మునుగోడు ఉప ఎన్నిక సరైన వేదికగా భావిస్తోంది టీఆర్ఎస్. అందుకే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. మునుగోడులో ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్లను ఏకి పారేశారు.
బీజేపీ వంతు..
బీజేపీ వంతు వచ్చింది. ఇవ్వాళ మునుగోడులో సమరభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోన్నారు కమలనాథులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాను కప్పుకోనున్నారు. కోమటిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఉజ్జయినీ అమ్మవారి దర్శనం..
మునుగోడుకు రానున్న అమిత్ షా షెడ్యూల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని ఆలయానికి వెళ్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 2:40 నిమిషాలకు ఉజ్జయిని ఆలయం నుంచి పార్టీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి బయలుదేరి వెళ్తారు.
దళిత కార్యకర్త ఇంట్లో భోజనం..
సత్యనారాయణ ఇంట్లో సుమారు 40 నిమిషాలు పాటు ఉంటారు. అక్కడే భోజనం చేస్తారు. ఇరానీ చాయ్ టేస్ట్ చేస్తారు. అనంతరం 3:15 నిమిషాలకు బేగంపేటలోని హోటల్ రమదా మనోహర్ హోటల్కు చేరుకుంటారు. అక్కడ కొంతమంది రైతు ప్రతినిధులను కలుస్తారు. సాయంత్రం 4:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో మునుగోడుకు బయలుదేరి వెళ్తారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేశమౌతారు.
నొవాటెల్లో డిన్నర్..
5 గంటలకు బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి మళ్లీ హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వస్తారు. 6:50 నిమిషాకు రామోజీ ఫిల్మ్సిటీకి వెళ్తారు. రామోజీ రావుతో సమావేశమౌతారు. 7:20 నిమిషాలకు బయలుదేరి శంషాబాద్లో గల హోటల్ నోవాటెల్కు చేరుకుంటారు. అక్కడే రాత్రి భోజనం చేస్తారు. కొంతమంది ముఖ్యనేతలకు మాత్రమే దీనికి ఆహ్వానం ఉంది. వారితో భేటీ అనంతరం రాత్రి 9:30 గంటలకు బయలు దేరి తిరిగి ఢిల్లీ వెళ్తారు.