మునుగోడు నాయకులకు, జనాలకు ఊసరవెల్లి ఆదర్శం.. షాకింగ్ రాజకీయం చూస్తే నోరెళ్ళబెట్టటం ఖాయం!!
మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కు అవ్వాల్సిందే.
ఇక ఇదే అదునుగా మునుగోడు నియోజకవర్గంలో జంపు జిలానీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంప్ అవుతున్న నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తున్నారు. అయితే కొందరు నేతలు ఉదయం ఒక పార్టీలో సాయంత్రానికి ఇంకొక పార్టీలో కనబడుతున్న పరిస్థితులు నియోజకవర్గ రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
మునుగోడులో పూటకో పార్టీ మారుస్తున్న జంప్ జిలానీలు
ప్రతి గ్రామంలోనూ ప్రజాప్రతినిధులు, రాజకీయాలు చేసిన నాయకులు పార్టీలు మారుతున్న వైఖరి జనాలను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాక గందరగోళం నెలకొంది. ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత, మరో పార్టీ నుంచి మంచి ఆఫర్ వస్తే ఎలాంటి మొహమాటం లేకుండా కండువాలు మార్చేస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు.
ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ ఎంపీటీసీ భాస్కర్ పది రోజుల క్రితమే చుండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం తో కలిసి టిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. మళ్లీ తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఆఫర్ ను బట్టి నిర్ణయం ... కొనసాగుతున్న వలసల పర్వం
గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, నెల రోజుల క్రితం గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బిజెపిలో చేరి, మళ్లీ టీఆర్ఎస్ కు తిరిగి వచ్చారు. కేవలం నెల రోజుల వ్యవధిలో మూడు పార్టీల కండువాలు మార్చిన ఈ ఎంపీటీసీ మాత్రమే కాకుండా, చాలామంది నాయకులు ఇదే తరహాలో ఎవరు అవకాశమిస్తే అటు పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
జనాలు కూడా యూటర్న్... ఎలాగంటే
ఇటు రాజకీయ పార్టీల నాయకులే కాదు ప్రజలు సైతం ఊహించని షాక్ ఇస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో చుండూరు మండలం కొండాపురం గ్రామం లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తర్వాత, చీరలు నాసిరకంగా ఉన్నాయని వీరంగం వేసిన ఒక మహిళ, కెసిఆర్ ను నోటికొచ్చినట్టు తిట్టారు. కెసిఆర్ భార్య, కేసీఆర్ బిడ్డ కవిత ఈ చీరలు కట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు.
ఇంత దరిద్రపుగొట్టు చీరలు ఎవడివ్వమన్నాడు అంటూ వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సదరు మహిళ, మళ్లీ గులాబీ కండువా కప్పుకొని సీఎం కేసీఆర్ కు జై కొట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నాయకులది, ప్రజలది అదే తీరు... గందరగోళంలో పార్టీలు
అంటే మునుగోడు నియోజకవర్గంలో నాయకులే కాదు, జనాల తీరు కూడా ఆసక్తికరంగా మారింది. మునుగోడులో యూటర్న్ పాలిటిక్స్ అటు రాజకీయ నాయకులలోనూ, జనాలలోనూ కనిపిస్తున్నాయి. పార్టీ నాయకులు రోజుకో పార్టీ మారుతూ రాజకీయాలు చేస్తుంటే, జనాలు కూడా తామేమీ తక్కువ తినలేదని, ఒక పూట కాంగ్రెస్ పార్టీకి, ఇంకా పూట బీజేపీకి, మరొక పూట టిఆర్ఎస్ కు జై కొడుతున్నారు.
ఏదిఏమైనా ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో తాజా పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇక మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్ అని చెప్పాలి.