కేసీఆర్ నో వర్రీ - రేవంత్ హర్రీ : పద్మవ్యూహంలో రాజగోపాల్ - జరిగేదిదేనా...!!
మునుగోడు బై పోల్ ఫలితం ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారుతోంది. ఇక్కడ ఎవరు గెలిచినా రానున్న ఎన్నికల సమీకరణాల పైన ప్రభావం చూపుతోంది. కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ - బీజేపీ కంటే వ్యక్తిగతంగా రేవంత్ వర్సెస్ రాజగోపాల్ అన్నట్లుగా పోరు సాగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ - బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికలకు సై అంటున్నాయి. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ మౌనం పాటిస్తోంది. కానీ, ఏ పార్టీలోనూ గెలుపు పైన ధీమా కనిపించటం లేదు. కనీసం గెలుపు మాదే అంటూ కూడా చెప్పుకోవటం లేదు.

రాజగోపాల్ సమర్ధతకు పరీక్షగా
రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు రాజీనామా చేసి..తిరిగి అదే సీటు నుంచి మరో సారి పోటీకి సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన కాంగ్రెస్..వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ కంటే గెలుపు కష్టాలు రాజగోపాల్ కే ఎక్కువగా ఉన్నాయి. తాను అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నుంచి తనపైన విమర్శలు చేసి వెళ్లటంతో ఇప్పుడు రేవంత్ కు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..ఇప్పటి వరకు అసలు రాజగోపాల్ రాజీనామా లేఖ స్పీకర్ కు ఇవ్వలేదు. కానీ, కాంగ్రెస్ మునుగోడులో సభకు సిద్దమైంది. రేపు (శుక్రవారం) కాంగ్రెస్ నేతలంతా మునుగోడు సభలో పాల్గొనున్నారు. అటు సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు.

టీఆర్ఎస్ - బీజేపీ పై పరోక్ష ప్రభావం
టీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి మినహా ఇతర నేతలెవరూ దీని పైన స్పందించలేదు. రాజగోపాల్ రాజీనామా చేసినా.. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నవంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ బై పోల్ జరిగే అవకాశం ఉంది. బీజేపీకి గుజరాత్-హిమాచల్ ప్రదేశ్ లో జరిగే ఎన్నికలే కీలకం. ఇక, ఇప్పటికే తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైన ఊహాగానాలు మొదలయ్యాయి. మునుగోడు కాంగ్రెస్ సీటు. ఇక్కడ రాజగోపాల్ వ్యక్తిగతంగా బలమైన ఓట్ బ్యాంకు ఉంది. కానీ, రాజగోపాల్ - కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరినా..అక్కడ ఓటర్లు పూర్తిగా మద్దతు నిలుస్తారా అనేది ఇంకా ఏ సర్వే ఏ పార్టీకి పూర్తిగా తేల్చని అంశం. అటు..రేవంత్ కు పార్టీ పరంగా సట్టింగ్ సీట్. తమను కాదని వెళ్లిపోయిన రాజగోపాల్ ను ఓడించాలనేది రేవంత్ పట్టుదల. అందునా కోమటిరెడ్డి బ్రదర్స్ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు బాధ్యతలు అప్పగించిన సమయం నుంచి అసమ్మతి నేతలుగా మారిపోయారు.

రేవంత్ వర్సెస్ రాజగోపాల్..ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే
ఇప్పుడు సైతం రేవంత్ టార్గెట్ గానే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజగోపాల్ కు వ్యక్తిగతంగా ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకం. బీజేపీ అభ్యర్ధిగా గెలిస్తేనే..టీఆర్ఎస్ కు ఇబ్బంది. బీజేపీలోకి అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికలు..బీజేపీలో కొత్త జోష్ కు అవకాశం ఏర్పడుతుంది. అది టీఆర్ఎస్ కు నష్టం చేసే అంశం. కానీ, అది తమ దుబ్బాక..హుజూరాబాద్ తరహాలో సిట్టింగ్ స్థానం కాదు. ఇక, రేవంత్ అటు పార్టీకి..ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయ జలక్ ఇవ్వాలంటే ఇక్కడ పార్టీని గెలిపించుకొని.. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ వర్సస్ రాజగోపాల్ గా పరిస్థితులు మారుతుండటంతో.. మునుగోడులో కాంగ్రెస్ కు ఉన్న బలమైన ఓటింగ్ చీలిపోయే అవకాశం ఉందని..అది తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ ఎన్నిక పార్టీల కంటే వ్యక్తిగతంగా రేవంత్ - రాజగోపాల్ ప్రతిష్ఠకు సవాల్ గా మారబోతోంది. దీంతో..మునుగోడు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారనేది రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications