శివాజీకి జై అంటే నేరమా? హైదరాబాద్ ఫైల్స్ తీసుకొస్తాం: కేసీఆర్, ఎంఐఎంపై మురళీధర్ రావు ఫైర్
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బోధన్లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, మరో వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. 144 సెక్షన్ కూడా విధించారు. అయితే, టీఆర్ఎస్, ఎంఐఎం గూండాలతో కలిసి పోలీసులు.. హిందూ యువకులపై దాడులు చేశారంటూ ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎంఐఎం ఇస్లాం, టెర్రర్ కారిడార్కు కేసీఆర్ సహకారం: మురళీధర్ రావు
తెలంగాణ రాష్ట్రం.. భారత దేశంలో ఉందా? లేక పాకిస్థాన్లో ఉందా..? అని నిలదీశారు మురళీధర్ రావు. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, ఆదివారం బోధన్లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు. ఇక, దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టారని పోలీసులపై మండిపడ్డారు. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? అని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇస్లాం కారిడార్, టెర్రర్ కారిడార్ని ఎంఐంఎ ఏర్పాటు చేస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు వారికి సహకరిస్తున్నారని మురళీధర్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చా.. కేసీఆర్?: మురళీధర్ రావు
కేసీఆర్ అసెంబ్లీలో మూర్ఖంగా, అబద్దాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మురళీధర్రావు. హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చా? అని ప్రశ్నించిన ఆయన.. బాధ్యత రహితంగా మాట్లాడితే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్, ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక, బెంగళూరుకి వచ్చినన్ని పెట్టుబడులు హైదరాబాద్కి ఎందుకు రాలేదు..? అని నిలదీశారు.
హైదరాబాద్ ఫైల్స్ తీసుకొస్తాం: మురళీధర్ రావు
హిందువుల పలాయనం హైదరాబాద్లో నడుస్తోందన్న మురళీధర్ రావు.. పాతబస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫైల్స్ తీసుకోస్తాం. వదిలి పెట్టమన్నారు. రోహింగ్యాలకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వడానికే తెలంగాణ హోంమంత్రి ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు మురళీధర్ రావు. మరోవైపు, కాశ్మీర్ ఫైల్స్పై రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? అని నిదీశారు మరళీధర్రావు. కాశ్మీర్ ఫైల్స్ని ప్రశ్నిస్తే మాడి మసై పోతారన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. కాశ్మీర్ ఫైల్స్కి హైదరాబాద్కి సంబంధం ఉందన్నారు. కాశ్మీర్కి రక్షణ లేకపోతే తెలంగాణకు కూడా లేనట్లేనన్నారు. ఇక, కేసీఆర్ శిక్ష తప్పదంటూ మురళీధర్ రావు హెచ్చరించారు.