ఆ హత్య మంత్రి ప్రశాంత్ రెడ్డే చేయించాడు-దోషులు ఉరికంబం ఎక్కాల్సిందే-ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల బాల్కొండ నియోజకవర్గంలోని హాసకొత్తూరులో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త సిద్దార్థ్ హత్యలో మంత్రి ప్రమేయం ఉందన్నారు. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందునే సిద్దార్థ్ను మంత్రి ప్రశాంత్ రెడ్డి హత్య చేయించాడని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే అది టీఆర్ఎస్కే నష్టమని హెచ్చరించారు. మృతుడు సిద్దార్థ్ కుటుంబ సభ్యులను మంగళవారం(మే 25) ఎంపీ అరవింద్ పరామర్శించారు.

తొత్తుల్లా వ్యవహరించవద్దు... పోలీసులకు ఎంపీ వార్నింగ్
సిద్దార్థ్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఆయన కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేస్తే ఏడాది కాలంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి దాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సిద్దార్థ్ హత్య కేసులో నిందితుడైన హాసకొత్తూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేశ్కు జైల్లో బిర్యానీలు పెట్టాలని పోలీసులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఉన్న నిందితుడు ఫేస్బుక్లో పోస్టులు ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ తొత్తుల్లా వ్యవహరించవద్దని... నిందితుడికి సహకరిస్తున్న సీఐ,ఎస్ఐలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు : ఎంపీ
హత్య చేసినవారిని కాపాడాలని చూస్తే బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కాదు జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఇక్కడ దిగుతుందని అరవింద్ హెచ్చరించారు. దోషులు ఉరికంబం ఎక్కాల్సిందేనని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు సెక్రటేరియట్లో ఉంటున్నారని... భవిష్యత్తులో జైల్లో ఉంటారని హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి తమ్ముడు గంజాయి దందా నడిపిస్తున్నాడని ఆరోపించారు. అన్ని గ్రామాల్లో ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు,మహిళలకు,పేదలకు... ఎవరికీ ఏమీ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి మోర్తాడ్కు వచ్చి ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవెరలేదన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని... నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే ప్రశాంత్ రెడ్డిని చరిత్ర హీనుడిగా మిగిల్చే పని తాము చేస్తామని హెచ్చరించారు.

హత్య నేపథ్యం...
హాసకొత్తూరు గ్రామానికి చెందిన మాలవత్ శ్రీనివాస్, సరోజ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ (17) ఈ నెల 19న దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు మొదట అతను కరోనాతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు.కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.తన చెల్లెలితో సిద్దార్థ్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడన్న అనుమానంతో హాసకొత్తూరు టీఆర్ఎస్ అధ్యక్షుడు కనుక రాజేశ్ ఈ హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. స్నేహితులు దోన్పాల్ పృథ్వీరాజ్, జుంబారత్ అన్వేష్,సల్మాన్, రాకేశ్ యాదవ్ల సాయంతో రాకేశ్ను రాత్రిపూట పిలిపించి విచక్షణారహితంగా కొట్టారు.
Recommended Video

ఇలా బయటపడింది...
ఆ మరుసటిరోజు రాకేశ్ పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఆ తర్వాత రాకేశ్ మృతదేహాన్ని కవర్లో ప్యాక్ చేసి అంబులెన్సులో గ్రామానికి తీసుకొచ్చారు. కరోనా సోకి చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు అతని మృతదేహంపై గాయాలను గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఆగ్రహించిన స్థానికులు కనుక రాజేశ్ ఇంటిని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications