కలలో శ్రీరాముడు: ముస్లిం ఫ్యామిలీ రామకోటి, గణేష్ ఉత్సవాలు
వరంగల్: సాక్షాత్తు సీతాసమేత శ్రీరాముడు ఆ వ్యక్తికి కలలో కనిపించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అప్పటి నుంచి అతడు శ్రీరాముడికి దాసుడు అయిపోయాడు. అంతేగాక, అతని కుటుంబం మొత్తం శ్రీరామకోటి రాయడం ప్రారంభించింది. అంతేగాక, వినాయక వేడుకలు, ఇతర పండగలను కూడా ఘనంగా జరిపిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎండీ యాకూబ్పాషా, యాస్మిన్ దంపతులు 16 ఏళ్లుగా హన్మకొండలోని కాపువాడలో నివాసముంటున్నాడు. యాకూబ్పాషా వృత్తిరీత్యా పెయింటర్. ఏడాది క్రితం వరంగల్ గణేష్నగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ స్తూపం నిర్మాణ పనుల్లో పాల్గొన్నాడు.
ఆ సమయంలో తనకు భద్రాచలంలోని శ్రీరాముని విగ్రహం కలలో కనిపించిందని తెలిపాడు. వెంటనే తాను భద్రాచలం వెళ్లి రాముడ్ని దర్శించుకొని రామకోటి రచనకు శ్రీకారం చుట్టానని యాకూబ్బాషా చెప్పాడు.

ఆ తర్వాత శ్రీరాముని చిత్రపటాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజిస్తున్నట్లు తెలిపాడు. ఆయనతోపాటు భార్య, పిల్లలు కుష్బూ, సానియాలు శ్రీరామ కోటి రాస్తుండటం విశేషం. అంతేగాక, వినాయక చవితి పర్వదినం సదర్భంగా వినాయక విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాడు యాకూబ్.
తన దృష్టిలో సర్వమతాలు ఒక్కటేనని గొప్పగా చెప్పాడు యాకూబ్. తాను రోజూ నమాజ్చేస్తానని, అదే విధంగా ఉదయం, సాయంత్రం ఇంట్లోని శ్రీరాముని చిత్రపటం, గణపతి విగ్రహాల వద్ద దీపారాధన చేస్తానని తెలిపాడు. వచ్చే శ్రీరామ నవమి నాటికి తమ రామకోటి పూర్తవుతుందని ఆయన వెల్లడించాడు.












Click it and Unblock the Notifications