పెట్టుబడి పెడితే నాకేం రాలేదు, నా పేరొద్దు: శ్రీనివాసన్, కోర్టులోనే జగన్ లంచ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో తనను నిందితుడిగా చేరుస్తూ సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీటును, దానిని విచారణకు పరిగణలోకి తీసుకుంటూ సిబిఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిసి శివశంకర రావు గురువారం దీని పైన విచారణ జరిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించారు.
అంతకుముందు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా శ్రీనివాసన్కు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. పిటిషనర్ పైన అభియోగాలను సిబిఐ తన ఛార్జీషీటులో చూపించలేదని చెప్పారు. సిబిఐ సమయం కోరింది. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
కోర్టులోనే భోంచేసిన జగన్
అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ల పైన న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. దీంతో తరుచూ జగన్ కోర్టుకు వస్తున్నారు. గురువారం విచారణలో భాగంగా సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు ఒకేసారి విచారణకు రావడంతో జగన్తో పాటు ఈ కేసులో సహ నిందితులు కోర్టుకు వచ్చారు.
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదర రావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి తదితరులతో పాటు ఐఏఎస్ అధికారులు, వైసిపి నేత విజయ సాయి రెడ్డి, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా కోర్టుకు వచ్చారు.
వీరు మధ్యాహ్నం దాకా కోర్టులోనే ఉండవలసి వచ్చింది. అనంతరం విచారణ సెప్టెంబర్ 4కు వాయిదా పడటంతో జగన్ మినహా మిగిలిన వారంతా మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికి అరబిందో, హెటిరోలకు చెందిన కేసుల విచారణ ముగియనందున జగన్ సాయంత్రం దాకా అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో గురువారం మధ్యాహ్నం జగన్ కోర్టు ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.