నాగం స్టైల్: రాష్ట్ర నేతలకు దూరంగా, జాతీయ నేతలకు దగ్గరగా..
హైదరాబాద్: తీవ్ర అసంతృప్తితో వేగిపోతున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బిజెపి నుంచి బయటపడుతారంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతూ వస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకులు దూరంగా పెడుతున్నారని, సమావేశాలకు ఆహ్వానించడం లేదని గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, పార్టీ రాష్ట్ర నేతలకు ఆయనే స్వయంగా దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో ఆయనకు పడడం లేదనే మాట వినిపిస్తోంది. ఇతర రాష్ట్ర నాయకులకు కూడా ఆయన రుచించడం లేదని అంటూ వచ్చారు. అందువల్లనే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తెలంగాణ మిషన్ అనేదాన్ని తెరిచి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అంటున్నారు.
కానీ, నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర నాయకులకు దూరంగా ఉంటూ జాతీయ నాయకులకు చేరువగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరు కాని నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఏర్పాటైన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో వాలిపోయారట. దీన్నిబట్టి ఆయన జాతీయ నాయకులతో సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారని అంటున్నారు.
బిజెపి నుంచి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే నాగం జనార్దన్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. జాతీయ నాయకుల అండదండలతో బిజెపిలో తన రాజకీయాలను నడపాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, నాగం జనార్దన్ రెడ్డి స్టైలే వేరు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.