అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర: తరలిన భక్తజనం(పిక్చర్స్)
తెలంగాణ గిరిజన జాతరలో మేడారం తర్వాత పెద్దదైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.
ఆదిలాబాద్: తెలంగాణ గిరిజన జాతరలో మేడారం తర్వాత పెద్దదైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మెస్రం వంశ పటేళ్లు, పూజారులు (కటోడా) ఆలయ శుద్ధి నిర్వహించిన
అనంతరం నాగోబా ప్రతిమను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి గంగాజలంతో
అభిషేకించారు.
తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠించి నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. కాగా, ఇంటర్నెట్పై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు వైఫై సేవల కోసం అక్కడ టవర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

నాగోబా జాతరకు నాంది
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. గిరిజన సంప్రదాయాన్ననుసరించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దేవతకు మెస్రం వంశం ఆడపడుచులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.

మట్టి తవ్వి పుట్టలు
వంశంలో 22 తెగలకు చెందిన కోడళ్లతోపాటు ఏడు దేవుళ్లకు చెందిన వారిని వరస క్రమంలో ప్రధాన్ పిలిచి వారికి నాయక్వాడి, పటేల్ మట్టి కుండలను అందచేశారు. వారు మర్రి చెట్ల వద్ద గల పవిత్రజలాన్ని కోనేరు నుంచి తెచ్చి ఆ నీటితో మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు ఆలయం పక్కన మట్టి తవ్వి పుట్టలను వేశారు.

ఆలయ శుద్ధి
నాగోబా దేవతకు పూజలు చేసే మెస్రం వంశీయులు పటేల్లు వెంకట్రావు, మెస్రం చిన్ను, కటోడాలు హన్మంత్రావు, కోసురావు, నాయక్వాడి మెస్రం ధర్మ, ప్రధాన్ తుకుడోజి, దాదేరావు, పేన్ కొత్వాల్ మెస్రం తిరుపతి లు ఆలయ శుద్ది నిర్వహించారు.

అభిషేకం
అనంతరం నాగోబా దేవతను గర్భగుడి నుంచి బయటకు తీసుకవచ్చి గంగాజలంతో అభిషేకం చేసి తిరిగి గర్భగుడిలో ప్రతిష్టించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక నైవేద్యం సమర్పించారు.












Click it and Unblock the Notifications