తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి
హైదరాబాద్: నాగులచవితి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగుపాము పుట్టల వద్ద పాలు పోయడానికి బారులు తీరారు. దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష నివారణకై పూజలు చేస్తారు.
నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా.. కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. వరంగల్ వేయస్తంబాల ఆలయంలో నాగుల చవితి వేడుకలను భక్తులు అత్యంత వైభవంగా చేసుకున్నారు. అలాగే ప్రముఖ మఠమైన శ్రీగురుబావాజీ మఠంలో నాగులు చవిత వేడుకలు ఒంగోలు భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు.