నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న హోండా సిటీ కారు: తోసేసిన ఇద్దరు!
నల్గొండ: జిల్లాలోని వేములపల్లి వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఓ హోండా సిటీ కారు కొట్టుకు రావడం కలకలంగా మారింది. ఎడమ కాలువలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో పడవ మాదిరిగా కారు నీటిలో కొట్టుకుపోతోంది. ఇద్దరు వ్యక్తులు కారును కాలువ కట్ట మీద నుంచి నీటిలోకి తోసివేసినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.
నీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్న కారు కనపడటంతో వేములపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే, కారులో ఎవరు లేరని తెలిపారు. కారుని నీటిలో తోయడానికి గల కారణాలు ఏంటి? ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ కు గుండెపోటు.. అదుపుతప్పి ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిన్నంబావిలో ట్రాక్టర్ అదుపుతప్పి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శేరిగూడెం గ్రామంలో ఇటుకలను దించేసి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కకు పల్టీలు కొట్టింది.
ఈ ఘటనలో డ్రైవర్ తోపాటు ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్న సీతారాం, దుర్గ అనే ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన వీరంతా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.