నయీంతో ఏపీ బిజినెస్మెన్కు లింక్, నల్గొండ ఎమ్మెల్సీకి బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి, అలాగే, నానక్ రాంగూడకు చెందిన ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాపారికి సంబంధాలు ఉన్నట్లుగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సదరు బిజినెస్మేన్ ఓ స్కూల్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.
నయీంతో కలిసి ఇతను పలు సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారని సమాచారం. సదరు వ్యాపారవేత్త నయీంతో కలిసి చాలా సెటిల్మెంట్లకు పాల్పడినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీతో లింక్
గతంలో ఇతర పార్టీలో ఉండి, ఇప్పుడు అధికార పార్టీలోకి మారిన ఓ ఎమ్మెల్సీకి నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా డైరీలో ఉన్నట్లుగా సిట్ గుర్తించిందని తెలుస్తోంది. నయీం తరఫున ఎమ్మెల్సీ చాలామంది వ్యాపారులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీకి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో పోలీసులు సేకరిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది.
ఎమ్మెల్సీ, గౌరవపదమైన పదవి విషయంలో డైలమా
గతంలో ఇతర పార్టీలో ఉండి, ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన సదరు ఎమ్మెల్సీ ఓ గౌరవప్రదమైన పదవిలో ఉన్నాడని, కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం పెద్దలు తర్జన భర్జన పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన పదవికి ఎసరు వస్తుందని సదరు ఎమ్మెల్సీ ఆందోళనగా ఉన్నాడని అంటున్నారు. నయీం ఆస్తులకు ఈ ఎమ్మెల్సీ బినామీగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇతను పదవి కోసం పార్టీ మారాడాని అంటున్నారు.
ఈ ముగ్గురు మహిళలకే నయీం గుట్టు తెలుసు
నయీం భార్య, అలాగే, ఫర్జానా, అఫ్సానాలకు నయీం గురించిన చాలా విషయాలు, అతని గుట్టు మొత్తం కూడా తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. విచారణ అధికారులు నయీం కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడి కావొచ్చని భావిస్తున్నారు.