నల్గొండలో పోలీసుల కఠినత్వం: లాఠీలతో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి
నల్గొండ: కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణలో లాక్డౌన్ అమలులో ఉందన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చారు. పాస్లు ఉన్న వారికి మినహాయింపునిస్తూ... మిగతావారికి అనుమతి లేదని పోలీసులు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇక శనివారం రోజున పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా నల్గొండ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రోడ్డు పై కనిపించిన వారికి లాఠీలతో బదులు చెబుతున్నారు. అసలు ఎందుకు రోడ్డుపైకి వచ్చారో వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుంటా లాఠీలతో కొడుతున్నారు. దీంతో నల్గొండ పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు రోడ్డుపై కనిపిస్తే పోలీసులు కనికరం చూపించకుండా బాదేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా కొందరికి మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇందులో జర్నలిస్టులకు మినహాయింపు ఉంది. లాక్డౌన్ సందర్భంగా రిపోర్టు చేసేందుకు వెళుతున్న జర్నలిస్టులపై నల్గొండ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. కనీసం తాను జర్నలిస్టును, మీడియా ప్రతినిధి అని చెప్పుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా చితకబాదేస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై కూడా పోలీసులు లాఠీని ఝుళిపించారు. పాస్ ఉందని చెబుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఇళ్లకు పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి.
మరో వైపు పాస్ ఉందని జర్నలిస్టులు చెబుతున్నప్పటికీ.. కేవలం మీకు మాత్రమే ఉందని వాహనంకు అనుమతి లేదని కొత్త వాదాన్ని పోలీసులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రోడ్డు మీద విధుల్లో ఉన్న పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాస్ ఉన్నప్పటికి కూడా తమను వివరణ అడగకుండానే పోలీసులు లాఠీలకు పనిచెప్పడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. లాక్డౌన్ కఠినంగా ఉండాలని తమకు తెలుసని అయితే స్వయంగా సీఎం పాస్లు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వాలని చెప్పాక కూడా పోలీసులు ఇలా వ్యవహరించడం భావ్యం కాదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.