Hyderabad: పీఎస్ల పేర్లు మార్పు, 146 మంది సీఐల బదిలీ
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. అంతేగాక, పలు పోలీస్ స్టేషన్ల పేర్లు కూడా మారాయి. ప్రముఖ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు, డివిజన్ల పేర్లను మార్చుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 72వ లా అండ్ ఆర్డర్ పీఎస్గా టోలిచౌకి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సెక్రటేరియట్ పీఎస్ను లేక్ పోలీస్ స్టేషన్గా, హుమాయున్నగర్ పోలీస్ స్టేషన్ను మెహదీపట్నం పీఎస్గా, షాహినాయత్గంజ్ పీఎస్ను గోషామహల్ పోలీస్ స్టేషన్గా మార్చినట్లు సీపీ వెల్లడించారు. కాగా, దాదాపు 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో పోలీస్ స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని వివరించారు. హైదరాబాద్ నగరంలో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

రెండేళ్లుగా పోలీస్టే స్టేషన్ల హద్దుల్లో సమస్యలు ఎదురవుతున్నాయని, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపితే మార్పులకు ఆమోదం తెలిపిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ స్టేషన్ల వివరాలను హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో పోలీసు అధికారులు బదిలీలు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 146 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాంపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు
నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలాంటి విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. వెయిటింగ్ హాళ్లు, సర్క్యులేటింగ్ ఏరియా, రైళ్లు, ప్లాట్ ఫాంలపై ఉన్న ప్రయాణికులను, వారి బ్యాగులను తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి అధునాతన పాపిలాన్ పరికరాలను ఉపయోగించారు. ప్రయాణికుల భద్రత కోసం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications