బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
హైదరాబాద్: బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అరవింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.... జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా.. 2020 నవంబర్ 23వ తేదీన కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను, హోర్డింగ్లను ఎంపీ అరవింద్, అతని అనుచరులు చింపివేశారంటూ కేసు నమోదైంది..
అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ని అనేక రకాలుగా తిడుతూ వ్యక్తిగత విమర్శలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ హోదాలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. ధర్మపురి అరవింద్పై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
అయితే, ఆ కేసులో సాక్షుల విచారణ పూర్తై.. 313 ఎక్సమినేషన్ కి తప్పని సరి రావాల్సిన ఉన్నా.. అరవింద్ రాకపోవడంతో గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే అరవింద్ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు సూచించింది నాంపల్లి కోర్టు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 28వ తేదీకి వాయిదా వేసింది.