కెసిఆర్ అందుకే రావట్లేదు, మేమే కింగ్ మేకర్లం: లోకేష్, కెటిఆర్కు షబ్బీర్ సవాల్
హైదరాబాద్: ప్రజాగ్రహం వల్లనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సచివాలయానికి రావడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శుక్రవారం నాడు అన్నారు. తాను ఎల్లుండి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పారదర్శకంగానే టిక్కెట్లు కేటాయించామని చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కింగ్ మేకర్ కావడం ఖాయమని చెప్పారు. గెలిచే సత్తా లేకనే అధికార టిఆర్ఎస్... ఇతర పార్టీల నేతలను చేర్చుకుందని ఎద్దేవా చేశారు.
గ్రేటర్లో టిఆర్ఎస్కు బలమే ఉంటే టిడిపి నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. గ్రేటర్ పరిధిలో ఈనెల 24 నుంచి 31 వరకు ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. నగరంలో కనీసం రహదారులు కూడా వేయలేని టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్నారు.
ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ను నమ్మడం లేదని, అందుకే మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ముందుకు తీసుకు వచ్చారన్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రాకుండా ఫామ్హౌస్కే పరిమితం అవుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
రాజకీయ సన్యాసం: షబ్బీర్ అలీ సవాల్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస వంద సీట్లలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సవాల్ చేశారు. వంద సీట్లు రాకుంటే కెటిఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉపసంహరింప చేసేందుకు బెదిరింపుకు పాల్పడ్డారని ఆరోపించారు.