కరోనా మిగిల్చిన విషాదం-ఒకే కుటుంబంలో ఒకే రోజు ముగ్గురు మృతి-గంటల వ్యవధిలోనే...
కరోనా సెకండ్ వేవ్ కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది.కరోనా బారినపడి ఒకే ఇంట్లో ఇద్దరి కంటే ఎక్కువమంది మరణించిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. కరోనా కాటుతో ఆ కుటుంబాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిన వైనం... ఎదిగొచ్చిన బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఘటనలు కళ్ల ముందు ఎన్నో కనిపిస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లాలో ఒకే కుటుంబంలో ఒకే రోజు ముగ్గురు కుటుంబ సభ్యులు కరోనాతో మృతి చెందారు.
మొదట రెండో కుమారుడికి...
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామానికి చెందిన భద్రయ్య స్వామి-శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు,ఒకు కూతురు ఉన్నారు. భద్రయ్య స్వామి స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు నాగస్వామి కుటుంబం నారాయణపేటలో,చిన్న కుమారుడు శాంతలింగం కుటుంబం మద్దూరు మండల కేంద్రంలో ఉంటున్నారు. రెండో కుమారుడు శంభులింగం కుటుంబం మొగల్ మడక గ్రామంలో ఆయన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. 15 రోజుల క్రితం మొదట శంభులింగం కరోనా బారినపడ్డాడు.
విషాదం : కరోనాతో ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతి... 11 రోజుల్లోనే...
ఆ తర్వాత తల్లిదండ్రులకూ...
కరోనా బారినపడినప్పటి నుంచి శంభులింగం ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నాడు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఒకటి,రెండు రోజులకే శంభులింగం తండ్రి భద్రయ్య స్వామి కూడా కరోనా బారినపడ్డారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. ఈ క్రమంలో భద్రయ్యను చూసేందుకు తరచూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన అతని భార్య శశికళకు కూడా కరోనా సోకింది. దీంతో ఆమెను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు.
గంటల వ్యవధిలోనే ముగ్గురి మృతి
శశికళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం(జూన్ 4) తెల్లవారుజామున ఆస్పత్రిలోనే కన్నుమూసింది. ఇదే రోజు ఉదయం 9గంటలకు కొడుకు శంభులింగం ఆరోగ్య పరిస్థితి విషమించి అతను కూడా మృతి చెందాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భద్రయ్య స్వామి కూడా ప్రాణాలు విడిచాడు. గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో చనిపోవడం ఆ కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
Recommended Video
విషాదంలో మునిగిపోయిన కుటుంబం
తమ గ్రామంలో అందరికీ వైద్య సేవలందించే భద్రయ్య స్వామి,శంభులింగం ఇలా కరోనా కాటుకు గంటల వ్యవధిలోనే బలవడం మొగల్ మడక గ్రామస్తులను సైతం ఆవేదనకు గురిచేస్తోంది. శశికళ-భద్రయ్య స్వామి దంపతులు,కుమారుడు శంభులింగం ఒకే రోజు కరోనాతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు మొగల్ మడక గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల రోధనలు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది.