తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం: అధికారిక వేడుకలు రద్దు
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఘనంగా నివాళి అర్పించింది. దేశం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారని పేర్కొంది. మానవీయ కోణంలో సంస్కరణలను చేపట్టిన ప్రధాని ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని తెలిపింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్.

తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. బ్యాంకింగ్ వ్యవస్థను ధృడంగా ఉంచగలిగారు మన్మోహన్ సింగ్.
ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, సంస్కర్తగా.. అన్నింటి కంటే మించి మన కాలంలోని మానవతావాదిగా ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, ఆచరణీయమని అన్నారు. సద్గుణాలు, నిష్కళంకమైన పరిపాలనను సమగ్రంగా, సమర్థంగా మానవీయ కోణంలో దేశ ప్రజలకు అందించారని అన్నారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడు రోజుల పాటు అంటే ఆయన కన్నుమూసిన రోజైన 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు అధికారికంగా ఎలాంటి ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని సూచించింది.
కాగా- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వాళ్లు శనివారం ఢిల్లీకి వెళ్లొచ్చని చెబుతున్నారు. పార్థివ దేహానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం.












Click it and Unblock the Notifications