అసహనం, అవార్డు వెనక్కి: తప్పుబట్టిన 'తెలంగాణ' కమిటీ, 'మోడీకి పేరు వస్తోందనే'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పైన అసహనంతో వివిధ అవార్డులను వెనక్కి ఇవ్వాలనే కొందరు వ్యక్తుల నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జాతీయ యువజన అవార్డుల సంఘం అధ్యక్షులు వేణు, ఇతరులు శనివారం నాడు తెలిపారు.
కొందరు అవార్డు గ్రహీతలు తీసుకున్న నిర్ణయం తప్పుడు సంకేతాలను ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవార్డుల ప్రాధాన్యం దెబ్బతింటుందని సూచించారు.
అసహనం లేదు: బండారు దత్తాత్రేయ
దేశంలో అసహనమే లేదని, అది ఉండకూడదని, అసహనం ఉంటే మనిషి బతకలేడని భారత్ అంటేనే ప్రజలు జీవించడానికి విశాలమైన హృదయంతో భారతీయత ఉంటుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. ఆయన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు.

దేశంలో కొందరు పదవుల కోసం పాకులాడే వారు, పదవులు లేకుంటే ఇంకెవరికీ పదవులు రాకూడదని వారే అసహనానికి గురై ఆ ప్రభావం అందరిపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి ప్రపంచదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఆదరణ పెరిగిపోవడంతో జీర్ణించుకోలేనివారు మాత్రమే దేశంలో అసహనం నెలకొందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
బిజెపి అంటే జాతీయత, దేశభక్తి అనే విధానంతో ముందుకెళ్తోందని, దేశాన్ని ప్రాణంగా భావించే నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో ఉంటారన్నారు. దేశంలో మతకలహాలు జరిగాయంటే అది కాంగ్రెస్ పాలనలోనే అన్నారు. కుహనా లౌకికవాద సిద్ధాంతాల్ని ప్రజలపై రుద్దడంతో పలుమార్లు మతకలహాలు చోటుచేసుకున్నాయన్నారు.
బిజెపి సిద్ధాంతం, తత్వం అభివృద్ధి, సుపరిపాలన, ప్రపంచదేశాల్లో భారతదేశమే గొప్పగా ఉండాలని కోరుకునే పార్టీ అన్నారు. కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని 11 పట్టణాలకు రూ.416 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications