నయీమ్ కేసు: ఇద్దరు పోలీస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అదనపు ఎస్పీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది.
2017 మేలో అప్పటి డీజీపీ అనురాగ్శర్మ విచారణ మేరకు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. నలుగురిపై శాఖాపరమైన విచారణకు, 16 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో అదనపు ఎస్పీలైన మద్దిపాటి శ్రీనివాసరావు, మలినేని శ్రీనివాసరావులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ముగ్గురిపైనా త్వరలోనే సస్పెన్షన్ ఎత్తి వేయనున్నారు. అయితే వీరిపై విచారణ మాత్రం కొనసాగుతుంది.

కాగా, నయీం ఎన్కౌంటర్ జరిగి ఇంతకాలమైనా ఇప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. బాధితుల ఫిర్యాదులతో ఇప్పటిదాకా 200లకుపైగా కేసులు నమోదవ్వగా వెయ్యి ఎకరాల భూములు, లక్ష చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకున్నారు.
అనేకమంది రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. వారి అండ చూసుకునే ఏళ్ల తరబడి పోలీసులకు పట్టుబడకుండా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడనే వాదన వినిపించింది. దీనికి బలం చేకూర్చుతూ డీజీపీ పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
కానీ, రాజకీయ నాయకుల విషయంలో మాత్రం ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొందరిపై ఏకంగా పోలీస్స్టేషన్లోనే ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు కేసు నమోదై రెండేళ్లు కావస్తున్నా ఇంకా కొలిక్కిరాలేదు. పలువురు సిట్ అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నయీం కేసు పరిస్థితి ఎటూ తేలకుండా మారింది.












Click it and Unblock the Notifications