నయీం కంప్యూటర్లలో దిమ్మతిరిగే సమాచారం: 4 వేల సినిమాలు
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం విషయంలో వెల్లడవుతున్న విషయాలు దర్యాప్తు అధికారులకే దిగ్భ్రమకు గురి చేస్తున్నాయి. ఏకంగా 4 వేల సినిమాలకు సరిపడా సమాచారాన్ని అతను కంప్యూటర్లలో భద్రపరిచాడని తేలింది. అంటే దాదాపు 7 టెరా బైట్లు (7000 జీబీ) స్టోరేజీని వాడుకున్నాడని తెలిసింది. అతడు చేసిన కబ్జాలు, సెటిల్మెంట్లు.. వాటికి సంబంధించి స్కాన్ చేసిన డాక్యుమెంట్లు, ఫోన్ సంభాషణలు, వీడియోలు మొదలైనవాటిని అతను భద్రపరిచాడు.
సీడీలు, డీవీడీలు, పెన్ డ్రైవ్లు, మెమరీ కార్డులతోపాటు కంప్యూటర్లు, ల్యాప్టాపుల్లో వీటిని గుర్తించింది. నయీం ఇంట్లో గుట్టలకొద్దీ సీడీలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ సహా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల స్థలాలు, ఇళ్లను లాక్కున్న నయీం ప్రతి డాక్యుమెంట్ను స్కాన చేసి సీడీలో భద్రపరిచాడు. డాక్యుమెంట్లతోపాటు నయీం తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలను ఫోన్లలో రికార్డు చేశాడు.
వాటిని కూడా సీడీల్లో భద్రపరిచినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. తాను దిగిన ఫొటోలు, రాజకీయ, పోలీస్, ఇతర ప్రముఖులతో జరిపిన పార్టీల సమయంలో తీసిన వీడియోలను భద్రపరిచాడు. వీవవీటన్నింటినీ విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది.
నయీం చేతుల్లో ఆస్తులు పోగొట్టుకున్నవారు ఎక్కువ మటుకు నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే. ఈ జిల్లాల్లోనే నయీం వందల ఎకరాలు కబ్జాపెట్టాడు. సిట్కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తమ భూముల విలువను లక్షలు, కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. దీంతో, నయీం కబ్జా పెట్టిన, అతని ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
క్యూ కట్టారు...
నయీం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సిట్ కంట్రోల్ రూమ్కు 150కిపైగా ఫోన్కాల్స్ వచ్చాయి. సైబరాబాద్ సీపీ మహేశ్ భగవత మంగళవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కూ బాధితులు క్యూకట్టారు. తమ భూములు తమకు ఇప్పించాలని వేడుకున్నారు. నయీంకు బాడీగార్డులుగా పని చేసిన ఫర్హానా, అఫ్సాలను ఆరు రోజుల పోలీసు కస్టడీకి రాజేంద్ర నగర్ కోర్టు అనుమతించింది. బుధవారం ఉదయం నుంచి వారు పోలీసు కస్టడీలో ఉంటారు.
మావోయిస్టులు నగదుతోపాటు ఇతర విలువైన వస్తువులను డంపుల రూపంలో భద్రపరుస్తారు. అదే తరహాలో నయీం కోట్ల రూపాయలను డంపుల రూపంలో భద్రపరిచినట్లు కొంతమేరకు సమాచారం సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. నయీం ఆస్తులకు బినామీలుగా 80 శాతం కుటుంబ సభ్యులే ఉన్నట్లు సిట్ గుర్తించింది. మిగతా 20 శాతం ఆస్తులకు బినామీలు ఎవరన్న దానిపై అధికారులు దృష్టి సారించారు.
250 బ్యాంంకు ఖాతాలు
నయీం ఏకంగా 250 బ్యాంకు ఖాతాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలన్నీ కుటుంబ సభ్యుల పేర్లతోనే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా నయీమ్ సోదరి సమీరా, భార్య హసీనా, వంట మనిషి ఫర్ఙానా పేర్ల మీద ఉన్నట్లు తేలింది. వాటి లావాదేవీల వివరాలు కొరుతూ సిట్ అధికారులు ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు.
నయీమ్ ఎక్కువగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వవారానే లావాదేవీలను సాగించినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి డబ్బులు ఆన్లైన్ ద్వారానే జమ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అతని డెన్ల్లో ఇప్పటి వరక వందల కొద్ది బ్యాంక్ చెక్కుబుక్కులు లభించాయి. నయీమ్కు, అతని కుటుంబ సభ్యులకు, ముఖ్య అనుచరులకు సంబందించిన చెక్కుబుక్కులు ఉన్నాయి. చాలా బ్లాంక్ చెక్కులు కూడా లభించినట్లు సమాచారం.