రూ.10వేల కోట్ల నయీం సామ్రాజ్యం, హైద్రాబాద్ అడ్డా, ఆస్తుల చిట్టా పెద్దదే
హైదరాబాద్: తనది పదివేల కోట్ల సామ్రాజ్యమని, ఈ రాష్ట్రాన్నే కొనగలనని గ్యాంగ్ స్టర్ నయీం బెదించిన సందర్భాలు ఉన్నాయట. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఇదే విషయం చెప్పి ఆయన బెదిరించారని తెలుస్తోంది. హైదరాబాదులో నయీం మాఫియా డెన్ ఏర్పాటు చేసుకున్నాడు.
తన ఆస్తులు, బలం చిట్టా విప్పి పలువురు ప్రజాప్రతినిధులను నయీం బెదిరించినట్లుగా చెబుతున్నారు. నయీంను పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో సోమవారం ఉదయం ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. నయీం గురించి ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాదులో డెన్, ఆస్తులు..
నయీం గత రెండేళ్లుగా హైదరాబాదులో నివసిస్తున్నాడని తెలుస్తోంది. ఇక్కడి నుంచే ఐదు జిల్లాల్లో దందా చేస్తున్నాడని సమాచారం. నగర శివార్లలో అతను రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని, హైదరాబాద్ - భువనగిరి మధ్య ఒకేచోట రెండు వందలకు పైగా ఎకరాలు కొన్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో వాణిజ్య సముదాయాలను ఆక్రమించాడని తెలుస్తోంది. నయీంకు ముంబై, పుణేల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హైవే పక్కన విలువైన భూములున్నాయి. నార్సింగ్లో అరకోటి ఇల్లు అతడి చిన్నమ్మ కుమారుడి భార్య పేరిట ఉంది.
ఈ ఇంట్లో రూ.30 కోట్ల విలువ చేసే భూములకు సంబందించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భూదందాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడేందుకు హైదరాబాద్ను నయీం అడ్డాగా మార్చుకున్నాడు.
రాజేంద్ర నగర్ మండలం నెక్నాపూర్ గ్రామంలో కళ్లు చెదిరే రీతిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడని తెలుస్తోంది. ఈ ఇంటి చుట్టూ రక్షణ కవచంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశాడు. రోజూ ఐదు కిలోల మాంసంతో కూడిన పదార్ధాలు అక్కడకు చేరుతుంటాయి.
అర్ధరాత్రి తర్వాత రెండు ఖరీదైన కార్లు వస్తాయంటారు. ముందుగా వచ్చి న కారు నుంచి సిగ్నల్ అందాకే, మరో కారులో ఉన్న నయీం ఆ ఇంట్లోకి వెళ్తాడని తెలుస్తోంది. అక్కడ నలుగురు ఎప్పటికీ కాపలా ఉంటారు. కొల్లగొట్టిన ఆస్తులను నయీం తక్కువ ధరకు మళ్లీ రాజకీయ నేతలకే కట్టబెట్టేవాడట. నల్గొండ జిల్లాలో కొద్దిమంది మినహాయిస్తే అందరూ నయీం అనుచరులేనని అంటున్నారు.
అధికార పార్టీ నేతలు టార్గెట్
గ్యాంగ్ స్టర్ నయీం తెరాస నేతలనే టార్గెట్ చేశారని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అలజడికి కూడా నయీం కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని అంటున్నారు.
నయీం బెదిరింపు
తన సోదరుడు అలీభాయ్ పేరుతో నిర్వహించే వినాయక ఉత్సవాలకు రాలేదంటూ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, వేముల వీరేశంకు నయీం హెచ్చరికలు జారీచేశాడు. దీంతో నయీమ్ ఆగడాలపై ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
నయీం బెదిరింపు
నయీం నుంచి ప్రాణహాని ఉండడంతో భువనగిరి ఎమ్మెల్యేకు బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించారు. కొన్నాళ్ళుగా తెలంగాణలో మళ్ళీ అలజడి సృష్టించేందుకు నయీమ్ కుట్రపన్నాడనీ, అధికార పార్టీ నేతలను మట్టుబెట్టేందుకు స్కెచ్ వేశాడనే ప్రచారం జరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదిహేనేళ్ల క్రితం అరెస్ట్
2001లో చివరిసారిగా పోలీసులు నయీంని అరెస్ట్ చేశారు. 2007మేలో నాంపల్లి క్రిమినల్ కోర్డులో హాజరు పరిచిన సమయంలో పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి నయీం పూర్తిగా అజ్ఞాతంలో వుంటూనే గ్యాంగ్స్టర్గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. కాగా, అధికార పార్టీ నేతలను కూడా బెదిరించుకుంటూ.. పోలీసులతో సాన్నిహిత్యం.. ఇలా అతివిశ్వాసం నయీం హత్యకు దారి తీసిందంటున్నారు.