ప్రముఖ సాహితీవేత్త నాయని కృష్ణకుమారి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ నాయని కృష్ణకుమారి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగు జానపద సాహిత్యంలో కృష్ణకుమారి విశేష కృషి చేశారు.
నాయని కృష్ణకుమారి ప్రముఖ కవి స్వర్గీయ నాయని సుబ్బారావు కూతురు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతిగా కూడా ఆమె పనిచేశారు. ఆమె విశాఖపట్నంలో తెలుగు ఎంఎ చేశారు. ఆ తర్వాత ఏడాది పాటు మద్రాసులో లెక్చెరర్గా పనిచేశారు.
ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చెరర్గా చేరారు. ఆ తర్వాత అక్కడే రీడర్గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు స్వీకరించారు. వీసి బాధ్యతల నుంచి ఆమె 1999లో రిటైరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమె శిష్యులు చాలా మంది ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారు.
గొప్ప సాహితీవేత్తను కోల్పోయామని పలువురు కవులు, రచయితలు సంతాప సందేశంలో పేర్కొన్నారు. నాయిని కృష్ణకుమారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి కృష్ణకుమారి ఎనలేని సేవలందించారన్నారు.
తెలుగు సంస్కృతిపై ఆమె ఎన్నో పరిశోధనలు చేశారని, గొప్ప సాహితీ విమర్శకురాలని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.