నీట్పై ఆర్డినెన్స్, ఏడాది వాయిదా: తెలుగు విద్యార్థులకు శుభవార్త
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. అంతకుముందే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
కేంద్రమంత్రి వర్గం ఇవాళ ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి వర్గం గురువారం ఆర్డినెన్స్ (అత్యవసర ఆదేశం) జారీ చేసింది. రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో కేంద్రం పరిగణలోకి తీసుకుంది.
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సుప్రీం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నీట్ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసింది. రాష్ట్రాల అభ్యంతరాలపై ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో చర్చించిన కేంద్ర మంత్రి వర్గం చివరకు ఈ నిర్ణయం తీసుకుంది.
నీట్ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని, అలాగే ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని పలు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
తెలుగు విద్యార్థులకు ఊరట
నీట్ పరీక్ష ఏడాది పాటు వాయిదా వేయడంతో తెలుగు విద్యార్థులకు ఊరట లభిస్తుంది. ఏపీలో ఎంసెట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది.
అలాగే, తెలంగాణ మెడికల్ ఎగ్జామ్ పరీక్షలకు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ కావాలని, ప్రవేశ తేదీని రేపు ప్రకటిస్తామని చెప్పారు. ఇది తెలుగు విద్యార్థులకు శుభవార్తే.