రాహుల్ను కలిసిన కేసిఆర్ మేనల్లుడు: గండ్ర ఫైర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేనల్లుడు ఉమేష్ రావు సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆయనతో చర్చించారు.
ఈ సందర్భంగా ఉమేష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ తెలంగాణ పర్యటన తర్వాత కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. అందుకే మరోసారి రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు.
ఏడాది పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని రాహుల్కు తెలిపినట్లు చెప్పారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచాలని కోరినట్లు ఉమేష్ రావు తెలిపారు.

టిఆర్ఎస్ నేతల ఆగడాలు మితిమీరాయి
తెలంగాణ రాష్ట్ర సమితి నేతల ఆగడాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై సోమవారం జరిగిన దాడిని ఖండించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వివక్ష చూపుతూ అవమానపరుస్తోందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చని సిఎం కెసిఆర్ మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. చెల్పూర్ విద్యుత్ కేంద్రం తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications