జాతీయపార్టీ పేరుతో కేసీఆర్ మైండ్ గేమ్ వెనుక కొత్తకోణం? తెలంగాణాలో ఆసక్తికర చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించడం, జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాలలోనూ, తెలంగాణ ప్రజలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కోసం ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో పోటీ చేయాలంటే తెలంగాణ అనే పేరు ఇబ్బందిగా మారుతుందని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తగినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో సక్సెస్ అవుతారా? అసలు కెసిఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక, జాతీయ రాజకీయాలను మినహాయించిన మరేదైనా కారణం ఉందా? అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక ఆసక్తికర కోణం
సీఎం కేసీఆర్ ఏం చేసినా బహువిధాలుగా ఆలోచించి, బహుముఖాలుగా ప్రయోజనం కలిగేలా ప్లాన్ చేస్తారు అన్నది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. కెసిఆర్ నిర్ణయం వెనుక బయటకు కనిపించే కారణం ఒకటి ఉన్నప్పటికీ, అంతర్గతంగా అనేక కారణాలు ఉంటాయి అనేది రాజకీయవర్గాలలో ఎప్పుడూ జరిగే చర్చే. ఇక తాజాగా జాతీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనుక ఢిల్లీ కోట ను టార్గెట్ చేయాలి అన్నది టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ చెబుతున్న కారణాలైతే, అంతర్గతంగా మరో కారణం కూడా ఉందని ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణా టార్గెట్ గా కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఇప్పటికే రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కట్టబెట్టిన ప్రజలు, ప్రస్తుతం కొంత కెసిఆర్ పాలన పైన విముఖత తో ఉన్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర మీద కాకుండా దేశం మీద దృష్టి సారించడం, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి టిఆర్ఎస్ పార్టీ ఎదిగింది అని చెప్పడం కోసమేనన్న చర్చ కూడా జరుగుతుంది. కేంద్రంలోని ప్రభుత్వంతో తలపడే స్థాయికి రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదిగిందని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయమైన ప్రగతిని సాధించింది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్ అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో పరువు కాపాడాలని చెప్పకనే చెబుతున్న కేసీఆర్
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో మరో ఆసక్తికర కోణం కూడా కనిపిస్తుంది అన్న చర్చ జరుగుతుంది. తెలంగాణ లోకల్ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ, దేశాన్ని శాసించేలా రాజకీయం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని కచ్చితంగా ప్రజలు ఆదరించి తీరాలి అన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా చెప్పకనే చెబుతున్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తనకు మద్దతు ఇవ్వకపోతే పరువు పోతుందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారు.
తెలంగాణా ప్రజల్లో సెంటిమెంట్ రగులుస్తున్న కేసీఆర్
నవ్వేటోడి ముందు జారి పడేలా చెయ్యొద్దు అని పదే పదే చెప్పే కెసిఆర్, ఈసారి అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సత్తా ఉన్న నాయకుడిగా కేసీఆర్ జాతీయ రాజకీయాలు చెయ్యడానికి వెళుతుంటే తెలంగాణ ప్రజల మద్దతు కచ్చితంగా ఉండి తీరాల్సిందే అన్న విషయాన్ని, ప్రజలలో ఆ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఖరారు చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రజల మనసుల్లో, జాతీయ నాయకుడిగా కేసీఆర్ తన స్థానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ స్ట్రాటజీపై తెలంగాణాలో ఆసక్తికర చర్చ
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి అని చెప్పకుండా, జాతీయ స్థాయిలో అధికారం కోసం కొట్లాడుతున్నాము. మీ సహకారం అవసరం అని చెప్పడం వచ్చే ఎన్నికల కోసం సీఎం కెసిఆర్ స్ట్రాటజీ అని తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోను ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ జాతీయ్ రాజకీయాల్లో రాణించే మాట అటుంచి తెలంగాణా టార్గెట్ గా ఇదో కొత్త వ్యూహం అంటున్నారు.