రేవంత్ స్థానం మారుతుందా? 2019లో ఎక్కడినుంచి పోటీ
హైదరాబాద్ : జిల్లాల విభజనతో ప్రతిపక్షాల ఉనికిని దెబ్బతీయాలనే కుట్ర చేశారని తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. జిల్లాల విభజన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల విభజన గనుక జరిగితే.. కచ్చితంగా రాజకీయ సమీకరణాలపై ఆ ప్రభావం పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
పైకి వ్యక్తం చేయకపోయినప్పటికీ.. పలువురు నేతల్లో ఇప్పటికే తమ భవిష్యత్తు రాజకీయ స్థానంపై కొంత ఆందోళన నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ భవిష్యత్తు రాజకీయ స్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం.. జిల్లాల విభజనతో వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లింది.
సామాజిక సమీకరణాల దృష్ట్యా.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గనుక జరిగితే రేవంత్ తాను ప్రాతినిధ్యాన్ని ఎక్కడికి మార్చుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. బహుశా వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి రేవంత్ పోటికి దిగవచ్చునని పలువురు అభిప్రాయపడుతుండగా.. రేవంత్ అత్తగారి జిల్లా అయిన రంగారెడ్డి నుంచి ఆయన పోటీకి దిగవచ్చునని మరికొందరు అభిప్రాయడుతున్నారు. కాగా, రేవంత్ అత్తగారిది రంగారెడ్డి జిల్లాలోని మాడుగుల గ్రామం.
ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు గనుక జరిగితే.. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున సీటు ఆశించే ఆశావహుల జాబితా కూడా పెరగనుంది.
బ్రాందీ వాదులెవరో ప్రజలకు తెలుసు : భట్టి కౌంటర్
ఖమ్మం : తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. బ్రాందీవాదులెవరో, గాంధీవాదులెవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బ్రాందీవాదులెవరో ప్రజలందరికీ తెలుసని... మత్తు వదిలించుకుని వస్తేనే రైతుల కష్టాలేంటో తెలుస్తాయని కౌంటర్ ఇచ్చారు.
రైతుల సమస్యలను పట్టించుకోకపోతే రైతులంతా తిరగబడే రోజు వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని తాటిపూడి, సోమవరం గ్రామాల్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు భట్టి విక్రమార్క. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.