హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్: ఏప్రిల్ నుండి కఠిన చర్యలు, అలా చేస్తే జైలుకే!!
ఏప్రిల్ నెల నుండి ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇకనుండి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చార్జిషీట్లు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

వాహనాలపై స్టిక్కర్లు అంటిస్తే కఠిన చర్యలు
కరోనా మహమ్మారి కారణంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఇంతకాలం కాస్త గ్యాప్ ఇచ్చామని పేర్కొన్న ఆయన ఇకపై ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే మునుపటిలాగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో వాహనాలపై స్థాయిని తెలియజేస్తూ స్టిక్కర్లు వేస్తున్నారని, వాహనాల అద్దాలపై స్థాయిని పేర్కొంటూ ఎవరు స్టిక్కర్లు అంటించ రాదని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను అందరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ పేర్కొన్నారు.

నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా స్టిక్కర్ లు వేసుకొని తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్లను మాత్రమే వాడాలని పేర్కొన్న ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకే విధంగా ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఆయన, త్వరలో స్పీడ్ లిమిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని, దానివల్ల ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది అంటూ పేర్కొన్నారు.

తాగి వాహనాలు నడిపితే జైలుకే
ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, తాగి వాహనం నడిపితే జైలుకు పంపిస్తామని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్ లను కట్టడం కోసం పోలీస్ శాఖ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను ప్రజలందరూ వినియోగించుకుంటున్నారని. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ కోసం పెట్టిన బంపర్ ఆఫర్ కు అనూహ్య స్పందన లభించింది అని వెల్లడించారు. ఇప్పటి వరకు 650 కోట్ల రూపాయలకు పైగా విలువైన పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని ఆయన తెలిపారు.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం ఇచ్చిన ఆఫర్ కు అనూహ్య స్పందన..
ఇచ్చిన రాయితీ పోను 190 కోట్లు వసూలు అయినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు వాహనదారులు కోటి 85 లక్షల చలాన్లు క్లియర్ చేశారని పేర్కొన్న ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే ఉందని గుర్తు చేశారు. రాయితీ గడువు పొడిగించే ఆలోచన లేదని పేర్కొన్నారు. పదిహేను వందల కోట్ల విలువ చేసే పెండింగ్ చలాన్లు ఉన్నాయని, 60 శాతం నుండి 70 శాతం వరకు పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications