మంత్రి తనయుడి బెదిరింపు కేసులో మరో ట్విస్ట్: వేధిస్తున్నాడని అభినవ్పై భువన
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ దాడి చేశారంటూ ఆరోపించిన అభినవ్ కేసు ఆదివారం నాడు మరో కొత్త మలుపు తిరిగింది. సాయి కిరణ్, అతని అనుచరులు తన పైన దాడి చేసి కొట్టి, తన భార్యను తన నుంచి విడదీసి, తన మామ మహేందర్ రెడ్డికి అప్పగించారని అభినవ్ చెప్పారు.
పోలీసు స్టేషన్లోను అలాగే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు పోలీసులు అభినవ్, భువన రెడ్డి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆదివార ఉదయం భువన రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో తన భర్త అభినవ్ పైన ఫిర్యాదు చేశారు. తన భర్త అభినవ్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అభినవ్ పైన కేసు నమోదయింది.
శనివారం రాత్రి భవన రెడ్డి తండ్రి కూడా అతని పైన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అభినవ్ పైన రెండు కేసులు నమోదయ్యాయి. మంత్రి తలసాని కుమారుడు, అతని అనుచరులుతన పైన దాడి చేసి, కేసును పక్కదారి పట్టించే విధంగా కేసులు పెడుతున్నారని, తనను అనవసరంగా కేసుల్లో ఇరికించారని అభినవ్ అంటున్నారు.